టీమిండియాకు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే అస్వస్థతకు గురైన స్టార్ ఓపెనర్!
టీమిండియాకు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే అస్వస్థతకు గురైన స్టార్ ఓపెనర్!
హైదరాబాద్ – 8 ఫిబ్రవరి – పీపుల్స్ మోటివేషన్
టీ20 ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టును అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైరల్ ఫీవర్ కారణంగా అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్కు దూరమవ్వగా, ఇప్పుడు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అనారోగ్యంతో జట్టుకు అందుబాటులో లేకపోయాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అభిషేక్ కడుపు నొప్పితో బాధపడుతూ మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాల్సి రావడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అతని స్థానంలో సంజూ శాంసన్ ఫీల్డింగ్కు దిగాడు.
జట్టు వైద్య బృందం తెలిపిన వివరాల ప్రకారం అభిషేక్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకుంటున్నాడని సమాచారం. పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా స్పందిస్తూ, ఈ నెల 12న నమీబియాతో జరిగే కీలక మ్యాచ్ నాటికి అభిషేక్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే వరుసగా ఆటగాళ్లు అనారోగ్యం, గాయాల బారిన పడటం జట్టు కాంబినేషన్పై ప్రభావం చూపుతోంది.
ఈ వరల్డ్ కప్లో అభిషేక్ శర్మకు ఆరంభం నిరాశాజనకంగా మారింది. అమెరికాతో జరిగిన తన తొలి సీనియర్ ఐసీసీ మ్యాచ్లో ఒక్క బంతి ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. దీనికి తోడు అనారోగ్యం కూడా వెంటాడడంతో యువ ఓపెనర్పై ఒత్తిడి పెరిగింది. మరోవైపు హర్షిత్ రాణా మోకాలి గాయంతో టోర్నీకి దూరమవ్వగా, వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. కీలక ఆటగాళ్లు త్వరగా కోలుకుంటేనే భారత్ టైటిల్ రేసులో నిలబడగలదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
