మహాశివరాత్రి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
మహాశివరాత్రి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
- శ్రీముఖలింగంలో క్యూలైన్లు, సౌకర్యాలపై కీలక ఆదేశాలు
- 18న చక్రతీర్థ యాత్ర – ఏర్పాట్లు పక్కాగా ఉండాలని స్పష్టం
- భద్రత, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం, ఫిబ్రవరి 06 (పీపుల్స్ మోటివేషన్):
మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీముఖలింగం క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిలతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లు, మంచినీటి వసతి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పనులను జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. అత్యవసర సేవల కోసం మెడికల్ టీమ్స్, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచాలని, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఉత్సవాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
చక్రతీర్థ యాత్రకు ప్రత్యేక ప్రణాళిక
ఉత్సవాల్లో అత్యంత కీలకమైన చక్రతీర్థ స్నానాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. 18వ తేదీన ఉదయం 10 గంటల వరకే భక్తులకు దర్శనాలు ఉంటాయని, మధ్యాహ్నం 12 గంటలకు చక్రతీర్థ యాత్ర ప్రారంభమవుతుందని ఆలయ సిబ్బంది వివరించారు. 17వ తేదీ సాయంత్రం నుంచే ఒడిశా తదితర ప్రాంతాల నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు.
నాలుగు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా చక్రతీర్థ స్నానాల రోజు వంశధార నది తీరంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, భక్తులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ, భక్తుల భద్రత దృష్ట్యా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. క్యూ లైన్లు, బారికేడ్లు, సీసీటీవీ నిఘా, పార్కింగ్ ప్రదేశాలు, కంట్రోల్ రూమ్లో వివిధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పలు సూచనలు జారీ చేశారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, జలవనరులు శాఖల అధికారులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

