మూడు నెలల్లో 3,371 వర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీ: లోకేశ్
మూడు నెలల్లో 3,371 వర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీ: లోకేశ్
ఖాళీల భర్తీకి కొత్త నోటిఫికేషన్ సిద్ధం
న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి చర్యలు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్పై పరిశీలన
అమరావతి, మార్చి 4 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రాబోయే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని రాష్ట్ర విద్య, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ప్రకటించారు. ఈ నియామకాల కోసం న్యాయపరమైన చిక్కులను అధిగమించి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. శాసనమండలిలో సభ్యుడు బొర్రా గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్సిటీల్లో మొత్తం 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు 2018, 2023లో నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ అవి అమలులోకి రాలేదని చెప్పారు. ముఖ్యంగా 2023 నోటిఫికేషన్లో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు సరిగా అమలు చేయకపోవడంతో న్యాయస్థానం అభ్యంతరం తెలిపిందని వివరించారు.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే అదనపు అడ్వకేట్ జనరల్తో మూడు సార్లు సమావేశమై చర్చించినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలనే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నప్పటికీ న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వయోపరిమితి సడలింపుపై ఇప్పటికే మంత్రుల సమితి ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 150 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు లోకేశ్ గుర్తుచేశారు. అదే విధంగా విశ్వవిద్యాలయాల్లో కూడా అధ్యాపక నియామకాలను అత్యంత ప్రాధాన్యంతో చేపడతామని అన్నారు. ఉన్నత విద్యా రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి కమిషనరేట్లను బలోపేతం చేయడం ద్వారా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
