విజయవాడలో ప్రభుత్వ ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు
విజయవాడలో ప్రభుత్వ ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు
- రంజాన్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు
- మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు
- పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి
విజయవాడ, 16 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
విజయవాడలో ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సమాజం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. పేదలకు సాయం చేయడం ఖురాన్ బోధించిన గొప్ప సిద్ధాంతమని, మహ్మద్ ప్రవక్త బోధనలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో కూడా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ముస్లిం సమాజం అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల కాలంలో మైనారిటీల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్రంలోని 4.38 లక్షల మంది ముస్లింలకు ఏటా రూ.3,511 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. అలాగే 4.5 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం కింద ప్రయోజనం కల్పిస్తున్నామని తెలిపారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కింద 19,215 మందికి రూ.240 కోట్లు అందించామని, దీపం పథకం ద్వారా 6.20 లక్షల కుటుంబాలకు రూ.158 కోట్ల సాయం అందిస్తున్నామని చెప్పారు.
అదేవిధంగా 33,275 మందికి ఆర్థిక సహాయం కింద రూ.193 కోట్లు అందించినట్లు సీఎం వెల్లడించారు. ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనాన్ని పెంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అందిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు రూ.180 కోట్లు ఖర్చు చేస్తున్నామని, బకాయిలుగా ఉన్న రూ.45 కోట్లను కూడా విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అర్హులైన ఇమామ్లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తామని, వివాహ లైసెన్స్ గడువును 3 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవో 47 వల్ల వక్ఫ్ బోర్డు వివాదాల్లో చిక్కుకుందని చంద్రబాబు విమర్శించారు. తమ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసి వక్ఫ్ బోర్డుకు ఎన్నికలు నిర్వహించిందని తెలిపారు. సుమారు 1500 వక్ఫ్ ఆస్తులపై సర్వే పూర్తి చేశామని చెప్పారు. వక్ఫ్ ఆస్తులను కాపాడి వాటి ఆదాయాన్ని ముస్లింల సంక్షేమానికి వినియోగిస్తామని భరోసా ఇచ్చారు. మైనారిటీల సంక్షేమానికి గత బడ్జెట్లో కేటాయించిన రూ.5,434 కోట్లను ఈసారి రూ.6,090 కోట్లకు పెంచామని సీఎం తెలిపారు. ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించామని, కడప మరియు విజయవాడ నగరాల్లో హజ్ హౌస్ల నిర్మాణం త్వరలో పూర్తవుతుందని పేర్కొన్నారు.
