శ్రీశైలం నీటి వివాదం..
శ్రీశైలం నీటి వివాదం..
- ఏపీపై తెలంగాణ మంత్రి జూపల్లి తీవ్ర విమర్శలు
- నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారన్న ఆరోపణ
- తెలంగాణ రైతులకు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయన్న ఆవేదన
- అక్రమ నీటి వినియోగం ఆపకపోతే పోరాటం హెచ్చరిక
హైదరాబాద్, మార్చి 31 (పీపుల్స్ మోటివేషన్): శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా విమర్శించారు. ఈ చర్యల వల్ల తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నీటి మట్టం తక్కువగా ఉన్న సమయంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం వాటిని పాటించకుండా నీటిని వినియోగిస్తోందని ఆరోపించారు. కనీసం తాగునీటి అవసరాలు కూడా ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్లు మంత్రి తెలిపారు. అప్పుడు తెలంగాణ నాయకులు ధర్నాలు చేసి, హైకోర్టును ఆశ్రయించగా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా అదే విధానాన్ని ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శించారు.
శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణకు 64 శాతం వాటా ఉందని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. నీటి కేటాయింపులపై ఇప్పటికే స్పష్టమైన జీవోలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదని అన్నారు. రైతుల హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాలరాయనివ్వమని స్పష్టం చేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అలుసుగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అక్రమంగా నీటిని తరలించడం ఆపాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతాంగం, ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కలిసి పోరాటం చేసి తమ హక్కులను కాపాడుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. నీటి వాటాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని జూపల్లి కృష్ణారావు గట్టి హెచ్చరిక చేశారు.
