సీఐడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం
సీఐడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం
- ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాననే కక్షతో వేధింపుల ఆరోపణ
- కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం సరైంది కాదని విమర్శ
- ఏప్రిల్ 4న విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు
హైదరాబాద్, మార్చి 31 (పీపుల్స్ మోటివేషన్): తనకు సీఐడీ నోటీసులు అందడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతోనే తనపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
“నన్ను లక్ష్యంగా చేసుకుని ఎన్ని కేసులైనా పెట్టండి, నోటీసులు ఇవ్వండి. కానీ నా కుటుంబాన్ని, పార్టీ సభ్యులను ఈ వివాదాల్లోకి లాగడం ఎంతవరకు న్యాయం?” అని ప్రశ్నించారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా కావాలనే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.Bఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని బెదిరింపులకు గురిచేసినా తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇది తన వ్యక్తిగత పోరాటం కాదని, ప్రజల కోసం చేస్తున్న పోరాటమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తాను ప్రశ్నిస్తూనే ఉంటానని హెచ్చరించారు.
ప్రశ్నించే గొంతును అధికార బలంతో అణచివేయలేరని, ప్రజల పక్షాన తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, జనవరి 29న హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంకలో జరిగిన మినీ మేడారం జాతర సందర్భంగా పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కరీంనగర్ పోలీస్ కమిషనర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు, ఏప్రిల్ 4న విచారణకు హాజరుకావాలని పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కేసుకు సంబంధించిన అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
