అప్పు వసూలు ఒత్తిడి ఆత్మహత్య ప్రేరేపణ కాదు
అప్పు వసూలు ఒత్తిడి ఆత్మహత్య ప్రేరేపణ కాదు
- సుప్రీంకోర్టు కీలక తీర్పు
- కేవలం డిమాండ్ను నేరంగా పరిగణించలేమని స్పష్టం
- గుజరాత్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు
- ఆధారాలు లేనప్పుడు కేసులు కొనసాగించరాదని వ్యాఖ్య
న్యూఢిల్లీ, మార్చి 20 (పీపుల్స్ మోటివేషన్): అప్పు తిరిగి చెల్లించాలని అడగడం లేదా ఒత్తిడి చేయడం మాత్రమే ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. కేవలం రుణం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు గుజరాత్కు చెందిన ఒక వ్యక్తిపై నమోదైన ఆత్మహత్య ప్రేరేపణ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చుతూ జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది. మోర్బీ జిల్లాలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో, పలువురు రుణదాతలు వేధించారని ఆరోపిస్తూ అతను రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసు కేసు నమోదు చేశారు. అందులో ఒకరైన ధీరూభాయ్పై ఐపీసీ సెక్షన్ 306, 506(2) కింద కేసు పెట్టారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ సమర్పించిన కాల్ రికార్డుల ప్రకారం నిందితుడు మృతుడికి పలుమార్లు ఫోన్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఆధారాలు ఆత్మహత్య ప్రేరేపణను నిరూపించడానికి సరిపోవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సూసైడ్ నోట్లో పలువురి పేర్లు ఉన్నప్పటికీ, ఎవరి పాత్ర ఏమిటో స్పష్టత లేకపోవడం గమనించిందని తెలిపింది.
రుణదాత ఫోన్ చేసి అప్పు తిరిగి ఇవ్వాలని అడగడం చట్టబద్ధమైన చర్యేనని కోర్టు స్పష్టం చేసింది. ఎక్కువసార్లు ఫోన్ చేసినంత మాత్రాన దానిని నేరంగా పరిగణించలేమని పేర్కొంది. మృతుడిపై శారీరక దాడి లేదా బలవంతం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కూడా కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితుడిపై క్రిమినల్ కేసు కొనసాగించడం చట్ట దుర్వినియోగంగా మారుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ధీరూభాయ్పై నమోదైన ఎఫ్ఐఆర్తో పాటు తదుపరి చర్యలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి కేసులపై కీలక మార్గదర్శకంగా నిలవనుంది.
