కుటుంబ సమేతంగా తిరుమలకు సీఎం చంద్రబాబు
కుటుంబ సమేతంగా తిరుమలకు సీఎం చంద్రబాబు
- దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు
- అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం
- తిరుమలలో రాత్రి బస… రేపు దర్శనం
తిరుమల, మార్చి 20 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ఆయన వెంట అర్ధాంగి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. కుమారుడు, మంత్రి నారా లోకేశ్ రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు.
శనివారం (మార్చి 21) దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. ప్రతి ఏడాది కొనసాగిస్తున్న ఆనవాయతీ ప్రకారం ఈసారి కూడా దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి సేవలో పాల్గొనాలని కుటుంబం నిర్ణయించింది. ఈ సందర్భంగా శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు నారా కుటుంబం తరఫున రూ.44 లక్షల విరాళాన్ని సమర్పించనున్నారు. ఒకరోజు అన్నవితరణ కార్యక్రమానికి అయ్యే మొత్తం వ్యయాన్ని భక్తి భావంతో అందించనున్నారు. ఈ సేవ ద్వారా అనేకమంది భక్తులకు అన్నదానం జరగనుంది.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తిరుమలలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రత, వసతి, దర్శన ఏర్పాట్లను సమన్వయంతో నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కుటుంబం ఈ రాత్రి తిరుమలలోనే బస చేయనుంది. రేపు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరిగి బయలుదేరనున్నారు. ఈ పర్యటన భక్తి, సంప్రదాయాల కలయికగా నిలుస్తోంది.
