ఉత్తరాంధ్రకు అభివృద్ధి ఊపు
ఉత్తరాంధ్రకు అభివృద్ధి ఊపు
- కేంద్ర మంత్రి కుమారస్వామి
- రూ.1.35 లక్షల కోట్లతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు
- విశాఖ ఉక్కు పునరుద్ధరణపై కేంద్రం హామీ
అనకాపల్లి, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (ఏఎంఎన్ఎస్) సంస్థ ఏర్పాటు చేయనున్న భారీ సమీకృత ఉక్కు కర్మాగారానికి ఘనంగా శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
సుమారు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుగా ఈ ఉక్కు కర్మాగారం రూపుదిద్దుకోనుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా ఛైర్మన్ ఆదిత్య మిట్టల్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించారు. పారిశ్రామిక అభివృద్ధిపై ఉన్న దృష్టి, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పాత్ర కూడా ఈ ప్రాజెక్టు సాధనలో కీలకమైందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతలో ‘వికసిత్ భారత్ 2047’, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాల సాధనలో భాగంగా ఉక్కు ఉత్పత్తిని పెంచాలని కేంద్రం సంకల్పించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ఎకోసిస్టమ్ బలోపేతం అవుతుందని, ఎంఎస్ఎంఈలకు కూడా ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఈ వేదికపైనే విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.11,440 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆర్ఐఎన్ఎల్ను పునరుజ్జీవింపజేసి మళ్లీ వృద్ధి పథంలోకి తీసుకురావాలని కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ఈ భారీ ప్రాజెక్టును సుమారు 5,400 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ప్రాజెక్టుకు అనుబంధంగా రూ.11,000 కోట్ల పెట్టుబడితో 50 మిలియన్ టన్నుల సామర్థ్యంతో క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం చేపట్టనున్నారు. దీని ద్వారా మరో 6,000 మందికి ఉపాధి కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టు స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
