కుటుంబాల సమగ్ర సమాచారానికి ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’
కుటుంబాల సమగ్ర సమాచారానికి ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’
- అన్ని శాఖల డేటాతో సమగ్ర డేటాబేస్
- ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ కార్డు’ లక్ష్యం
- ఏప్రిల్ 30 నాటికి 90 శాతం సమాచారం సిద్ధం
- సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి, మార్చి 4 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే వేదికపై సమీకరించేందుకు రూపొందిస్తున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలోని తన చాంబర్లో అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ ఐడీ, ఆధార్, రైస్ కార్డు, మొబైల్ నెంబర్, విద్యార్హతలు, వృత్తి, చిరునామా, వ్యవసాయ భూమి, ఇతర ఆస్తుల వివరాలు వంటి మొత్తం 26 రకాల అంశాలతో సమగ్ర డేటాబేస్ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమాచారాన్ని సేకరించి పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు.
ఈ డేటాబేస్ రూపకల్పన కోసం వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని సమీకరించాలని సీఎం తెలిపారు. ఎస్జీఎస్డబ్ల్యూ, విద్యుత్ పంపిణీ సంస్థలు, పురపాలక శాఖ, వెబ్ల్యాండ్, వాహన్, హెచ్ఆర్ఎంఎస్, పంచాయతీరాజ్, మార్క్ఫెడ్ వంటి విభాగాల వద్ద ఉన్న సమాచారాన్ని ఈ వ్యవస్థలో పొందుపరచాలని సూచించారు. ప్రస్తుతం 82 శాతం సమాచారం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. వచ్చే ఏప్రిల్ 30 నాటికి 90 శాతం డేటాబేస్ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ప్రభుత్వంలోని అన్ని శాఖల సమాచారాన్ని సమీకరించడం ద్వారా డేటా కచ్చితత్వం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ కార్డు’ అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దీనికి అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
