మెదక్ ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం..
మెదక్ ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం..
- లోక్ భవన్లో ప్రారంభం
- ఎంపీ రఘునందన్ రావు కృషి ఫలితం
- బీడీఎల్ CSR నిధులతో మొబైల్ సదుపాయం
- తొలిదశలోనే క్యాన్సర్ గుర్తింపు లక్ష్యం
హైదరాబాద్, మార్చి 30 (పీపుల్స్ మోటివేషన్): మెదక్ పార్లమెంట్ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ వాహనాన్ని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు సులభంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎంపీ రఘునందన్ రావు అభ్యర్థన మేరకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో ఈ మొబైల్ స్క్రీనింగ్ వాహనాన్ని సమకూర్చింది. ఈ వాహనంలో ఆసుపత్రుల్లో ఉండే అన్ని ప్రాథమిక స్క్రీనింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండటం విశేషం. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా దగ్గర్లోనే క్యాన్సర్ పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం పెరుగుతుందని అధికారులు తెలిపారు.
ఈ సేవలను మెదక్ పార్లమెంట్ ప్రజలు వినియోగించుకోవాలని గవర్నర్ మరియు ఎంపీ కోరారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ను నియంత్రించవచ్చని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ మొబైల్ వాహనం ఆ దిశగా ఒక ముందడుగుగా నిలుస్తుందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా ఆరోగ్య రంగంలో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీడీఎల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
