అసెంబ్లీ పనిదినాలు పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్
అసెంబ్లీ పనిదినాలు పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్
- మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు
- బడ్జెట్ సమావేశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్
- సభలో 19 అంశాలపై చర్చ కోరిన పార్టీ
హైదరాబాద్, 16 మార్చి (పీపుల్స్ మోటివేషన్): అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాలను బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన ప్రభుత్వం ప్రకటించిన సభా కార్యక్రమంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీని నడుపుతామని ప్రభుత్వం చెప్పిందని, అయితే మధ్యలో ఆదివారాలు, పండుగలు ఉంటే అసలు పని దినాలు ఎంత ఉంటాయో స్పష్టత ఇవ్వాలని తాము అడిగినట్లు తెలిపారు.
అసెంబ్లీ పనిదినాలు పెంచాలని బీఆర్ఎస్ తరపున బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో డిమాండ్ చేసినట్లు హరీష్ రావు పేర్కొన్నారు. అవసరమైతే ఆదివారాలు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం మార్చి 30 వరకు సభ నడుపుతామని చెప్పగా కనీసం మార్చి 31 వరకు సమావేశాలు నిర్వహించాలని తాము సూచించినట్లు వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం చెబుతామని ప్రభుత్వం తెలిపిందని చెప్పారు.
ఈ నెల 20వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించినట్లు హరీష్ రావు తెలిపారు. అలాగే 22వ తేదీ ఆదివారం కూడా అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. హౌస్ కమిటీల ఏర్పాటు ఆలస్యం అవుతోందని బీఏసీ సమావేశంలో తాము ప్రశ్నించగా వాటిని త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపిందని అన్నారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలపై కూడా హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపటి అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడాన్ని తాము ప్రశ్నించామని చెప్పారు. అన్స్టార్డ్ ప్రశ్నలు, జీరో అవర్లో అడిగిన ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానాలు ఇవ్వలేదని విమర్శించారు. అలాగే ఆరు హామీల అమలుపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరినట్లు తెలిపారు. అసెంబ్లీలో చర్చించాల్సిన 19 అంశాలను బీఆర్ఎస్ తరపున ప్రతిపాదించినట్లు హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ లైబ్రరీ పరిస్థితి దారుణంగా ఉందని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ నియామకం జరగకపోవడం సరైన విషయం కాదని విమర్శించారు. ప్రివిలేజ్ మోషన్లపై స్పందన లేదని స్పీకర్కు తెలిపినట్లు చెప్పారు. బీఏసీ నిర్ణయాలను అమలు చేయకపోతే తదుపరి సమావేశాన్ని బహిష్కరిస్తామని కూడా హెచ్చరించినట్లు హరీష్ రావు వెల్లడించారు.
