మోదీ సరికొత్త రికార్డు…
మోదీ సరికొత్త రికార్డు…
- అత్యధిక రోజులు ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడు!
- 8,391 రోజుల మైలురాయి సాధన
- సీఎంగా, ప్రధానిగా నిరవధిక సేవ
- చరిత్రలో నిలిచిన రాజకీయ ప్రయాణం
మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్): దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రభుత్వాధినేతగా మొత్తం 8,391 రోజులు పూర్తి చేసి దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. సీఎంగా, ప్రధానిగా కలిపి 24 ఏళ్లకు పైగా ఎలాంటి విరామం లేకుండా పదవిలో కొనసాగడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 8,390 రోజులు పదవిలో కొనసాగిన పవన్ కుమార్ ఛామ్లింగ్ రికార్డును మోదీ అధిగమించారు. మోదీ 2001లో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2014 వరకు సీఎంగా కొనసాగి, అనంతరం దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కూడా ప్రధానిగా కొనసాగుతున్న ఆయన, గుజరాత్కు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నేతగా నిలిచారు. ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం, ప్రధానిగా మూడు సార్లు విజయంతో మరింత బలపడింది.
2014, 2019, 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించి మోదీ హ్యాట్రిక్ సాధించారు. ఈ క్రమంలో మూడు సార్లు ఎన్నికల్లో విజయం సాధించిన జవహర్ లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు. అలాగే వరుసగా అత్యధిక రోజులు ప్రధానిగా కొనసాగిన రెండో నాయకుడిగా నిలిచి, ఇందిరా గాంధీ రికార్డును దాటారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడిగా మోదీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
