ఇంధన భద్రతకు భారత్ కీలక చర్యలు
ఇంధన భద్రతకు భారత్ కీలక చర్యలు
- అమెరికా, రష్యా నుంచి దిగుమతులు
- మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం
- మంగళూరు పోర్టుకు చేరిన భారీ నౌకలు
- సరఫరా స్థిరీకరణకు వ్యూహాత్మక నిర్ణయాలు
మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్): మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ సరఫరా గొలుసులో ఏర్పడుతున్న ఆటంకాల నేపథ్యంలో భారత్ తన ఇంధన భద్రతను బలోపేతం చేసుకునేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అమెరికా నుంచి ద్రవీకృత పెట్రోలియం వాయువు, రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఈ రెండు దేశాలకు చెందిన భారీ నౌకలు కర్ణాటకలోని మంగళూరు పోర్టుకు చేరుకున్నాయి. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీతో బయలుదేరిన ‘పైక్సిస్ పయనీర్’ నౌక విజయవంతంగా మంగళూరు పోర్టులో లంగరేసింది. ఇదే సమయంలో రష్యా నుంచి ముడి చమురును తీసుకొచ్చిన మరో నౌకను సముద్రంలో 18 నాటికల్ మైళ్ల దూరంలో నిలిపి ఉంచారు. సింగిల్ పాయింట్ మూరింగ్ విధానంతో ఈ చమురును పైప్లైన్ ద్వారా మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సముద్రంలో ప్రయాణిస్తున్న రష్యా ముడి చమురు సరఫరాకు అమెరికా తాత్కాలిక అనుమతి ఇవ్వడం గమనార్హం. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న భారత్, రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచింది. ఇరాన్ సంబంధిత పరిణామాల కారణంగా సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక గుజరాత్లోని వాడినార్, ముంద్రా పోర్టులకు ‘నందా దేవి’, ‘శివాలిక్’ భారత ఎల్పీజీ ట్యాంకర్లు సురక్షితంగా చేరుకున్నాయి. ప్రమాదకరంగా భావించే హర్మూజ్ జలసంధి గుండా వీటి ప్రయాణం విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 600కి పైగా భారత నావికులతో 20కి పైగా నౌకలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
