కల్తీ పాల ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలి: మార్గాని భరత్
కల్తీ పాల ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలి: మార్గాని భరత్
- రాజమండ్రి ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన మాజీ ఎంపీ
- ప్రభుత్వ నిర్లక్ష్యమే ఘటనకు కారణమని విమర్శలు
- బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్
రాజమండ్రి, 10 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ పరామర్శించారు. రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నేతలు ఈ ఘటనను తేలికగా తీసుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ వంటి నాయకులు బాధిత కుటుంబాల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ ఘటనను ప్రమాదంగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
పాలలో కల్తీ ఎలా జరిగింది అనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదన్నారు. పాలలో యూరియా కలిసిందా, ఫార్మాలిన్ కలిసిందా లేదా ఎవరో కావాలనే పురుగుమందు కలిపారా అనే విషయాలు వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. బాధితుల నమూనాలను జాతీయ ఫోరెన్సిక్ ప్రయోగశాలకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. 160 లీటర్ల పాలు తీసుకొచ్చినప్పటికీ కేవలం 20 కుటుంబాలు మాత్రమే ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని కోరారు. బాధిత కుటుంబాల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, చిన్నారులు కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీసం రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని విమర్శిస్తూ అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

