మరో మూడు రోజులు పిడుగులతో వర్షాలు
మరో మూడు రోజులు పిడుగులతో వర్షాలు…
- ఇప్పటికే పంటలకు తీవ్ర నష్టం
- ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా హెచ్చరికలు
- అరటి, మామిడి, మిర్చి, మక్కకు భారీ ముప్పు
- నష్టం అంచనా వేగవంతం చేయాలని మంత్రివర్గం ఆదేశాలు
మార్చి 19 (పీపుల్స్ మోటివేషన్): ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిస్థితులపై అప్రమత్తమైన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అరటి, మామిడి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని పేర్కొంటూ, దెబ్బతిన్న పంటలను వెంటనే గుర్తించి నష్టం నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పండిన పంటలను వెంటనే కోత కోసి భద్రపరచాలని సూచించారు.
ఇప్పటికే కురిసిన వడగళ్ల వాన రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. వరి, మొక్కజొన్నతో పాటు ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలో దానిమ్మ పంట పూర్తిగా రాలిపోవడంతో సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. నంబుల పూలకుంట మండలంలో 30 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగింది. బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లో అరటి, బొప్పాయి, చీనీ, మక్క పంటలు దెబ్బతిన్నాయి. కడప, తిరుపతి జిల్లాల్లో కూడా అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపించాయి. పులివెందులలో అరటి రైతులు, చంద్రగిరి ప్రాంతంలో వరి, మామిడి, టమోటా రైతులు నష్టపోయారు. వడగళ్ల వానతో కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నేలవాలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు, నందిగామ ప్రాంతాల్లో ఈదురు గాలులతో అరటి తోటలు నేలకొరిగాయి. బొప్పాయి తోటల్లో చెట్లు విరిగి కాయలు రాలిపోవడంతో పంట పూర్తిగా నష్టపోయింది. వేల ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట నేలపై పడిపోవడంతో రైతులు పెట్టుబడులు కూడా రాకపోవచ్చని ఆందోళన చెందుతున్నారు. మిర్చి పంటలు తడిసిపోవడంతో నాణ్యత దెబ్బతింది. ఏలూరు జిల్లాలో కూడా సుమారు 30 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు సమాచారం. కంకి దశలో ఉన్న పంటలు వర్షాలకు నాశనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు కొనసాగితే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
