ఏపీలో హైవేలపై ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు
ఏపీలో హైవేలపై ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు
- మొదటి దశలో 135 కేంద్రాలకు కేంద్రం ఆమోదం
- సుమారు 600 ఛార్జింగ్ యూనిట్లు అందుబాటులోకి
- ఆగస్ట్ నాటికి సేవలు ప్రారంభించే అవకాశం
అమరావతి, 10 మార్చి (పీపుల్స్ మోటివేషన్): దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని జాతీయ రహదారులపై దశల వారీగా 444 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. విద్యుత్ ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థలకు దగ్గరగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర బృందాలు దాదాపు 200 ప్రాంతాలను పరిశీలించాయి. ఇందులో తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 135 చోట్ల ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపాయి. ఈ కేంద్రాల్లో సుమారు 600 వరకు ఛార్జింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. బైక్ల నుంచి భారీ వాహనాల వరకు అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సదుపాయం కల్పించే విధంగా కేంద్రాలను రూపొందించనున్నారు.
ఈ పనుల కోసం త్వరలో టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తైన తర్వాత కాంట్రాక్టర్లకు పనులు అప్పగించనున్నారు. పనులు పూర్తి చేసి ఆగస్ట్ నెల నాటికి ఈ ఛార్జింగ్ కేంద్రాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనదారులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఒక్కో ఛార్జింగ్ కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఖర్చులో 80 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా మిగిలిన 20 శాతం రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు భరిస్తాయి. టెండర్ల ద్వారా ఎంపికైన ఆపరేటర్లు ఐదేళ్ల పాటు ఈ కేంద్రాలను నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక రెండో దశలో వైజాగ్, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో మరో వంద వరకు ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
