రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఉద్యమ హెచ్చరిక
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఉద్యమ హెచ్చరిక
- పీఆర్సీ, డీఏ, లీవ్ ఎన్కాష్మెంట్ తక్షణ చెల్లింపు డిమాండ్
- రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- బకాయిలు చెల్లించకపోతే భారీ ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిక
- ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, మార్చి 2 (పీపుల్స్ మోటివేషన్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం వృద్ధులు, ఉద్యోగులు రోడ్లపైకి రావాల్సి రావడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
పీఆర్సీ 2020 బకాయిలను వెంటనే చెల్లించాలని, డీఏ బకాయిలను వాయిదాలుగా కాకుండా ఏకమొత్తంగా ఇవ్వాలని, లీవ్ ఎన్కాష్మెంట్ను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2024 మార్చి నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. జీపీఎఫ్, జీఐఎస్ నిధులను వడ్డీతో సహా చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో జెండాలతో సంబంధం లేకుండా అందరూ కలిసి పోరాడినట్లే, ఈ రోజు కూడా పార్టీ జెండాలు పక్కన పెట్టి ఉద్యోగుల కోసం ఒక్కటిగా నిలబడాల్సిన సమయం వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, మాటలు గొప్పగా ఉన్నా అమలు మాత్రం కనిపించడం లేదన్నారు. ఆర్థిక శాఖలో నిర్ణయాలు పైస్థాయిలోనే నిలిచిపోతున్నాయని ఆరోపించారు.
రాష్ట్ర బడ్జెట్లో అదనపు ఖర్చులపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూముల విక్రయాలు, ఆర్థిక వనరుల వినియోగంపై పారదర్శకత అవసరమన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులను సంఘటితం చేసి పోరాటానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి ఇదొక హెచ్చరిక మాత్రమేనని, బకాయిల చెల్లింపులో తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
