శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్లో భారీ బందోబస్తు
శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్లో భారీ బందోబస్తు
- క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
- డ్రోన్లు, కెమెరాలతో నిశిత పర్యవేక్షణ
- మూడు వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
హైదరాబాద్, మార్చి 27 (పీపుల్స్ మోటివేషన్): శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ నగరంలో భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శుక్రవారం సీతారాం బాగ్ పరిసరాల్లో ఆయన అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించి, ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కమిషనర్, నగరంలో జరగనున్న శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీ, వాహన రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ యాత్ర మధ్యాహ్నం రెండు గంటలకు సీతారాం బాగ్ ఆలయం నుంచి ప్రారంభమై, రాత్రి పది గంటల కల్లా ముగిసేలా మార్గ ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. యాత్ర సాగే మార్గాలను ముందుగానే పరిశీలించి, ఎక్కడా ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భద్రతా పరంగా డ్రోన్లు, నిఘా కెమెరాల సహాయంతో నిరంతరం పర్యవేక్షణ చేపడతామని కమిషనర్ పేర్కొన్నారు. ప్రతి ముఖ్య కూడళ్ల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తామని తెలిపారు.
ఈ భారీ శోభాయాత్ర కోసం దాదాపు మూడు వేల మంది సిబ్బందిని నియమించి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ, జనసమ్మర్ధం నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. అంతకుముందు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్తో కలిసి కమిషనర్ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర విజయవంతంగా, ప్రశాంతంగా సాగాలని అధికారులు ఆకాంక్ష వ్యక్తం చేశారు.
