ఇంధన సంక్షోభం.. నగరంలో పెట్రోల్ బంకుల మూత
ఇంధన సంక్షోభం.. నగరంలో పెట్రోల్ బంకుల మూత
- యుద్ధ ప్రభావంతో సరఫరాలో అంతరాయం
- నో స్టాక్ బోర్డులతో వాహనదారుల ఇబ్బందులు
- అడ్వాన్స్ లేకుండా ఇంధనం ఇవ్వలేమంటున్న యజమానులు
హైదరాబాద్, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్): ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూతపడటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ప్రధాన కూడళ్లలో ఉన్న బంకులు కూడా వరుసగా మూతబడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. సోమాజిగూడ, ఎస్సార్ నగర్ వంటి కీలక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు అందుబాటులో ఉన్న కొద్ది బంకుల వద్ద బారులు తీరుతూ గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్న వివరాల ప్రకారం, యుద్ధానికి ముందు చమురు కంపెనీలు క్రెడిట్ సదుపాయం కల్పించేవని, ప్రస్తుతం ఆ సౌకర్యాన్ని నిలిపివేశారని తెలుస్తోంది. కొత్తగా ఇంధన సరఫరా పొందాలంటే ముందస్తుగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని, దీనివల్ల సరఫరా మరింత ఆలస్యమవుతోందని వారు అంటున్నారు. దీంతో చిన్న స్థాయి బంకులు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇరాన్తో యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కొంత ఉపశమనంగా భావిస్తున్నారు. ఇరాన్ కూడా ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందించే అవకాశమున్నట్లు సమాచారం. అయితే పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
