గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులు పట్టుబాటు
గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులు పట్టుబాటు
- ఎచ్చెర్ల పోలీసుల దాడిలో 2.3 కిలోల గంజాయి స్వాధీనం
- పోలీసులను చూసి పరారయ్యేందుకు యత్నించిన నలుగురు
- ఒకరు తప్పించుకోగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
శ్రీకాకుళం, 11 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం 2.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం ఎచ్చెర్ల ఎస్ఐ లక్ష్మణరావుకు అందిన ఖచ్చితమైన సమాచారంతో సిబ్బంది, మధ్యవర్తులతో కలిసి పోలీసులు తెలిపిన ప్రదేశంలో తనిఖీలు నిర్వహించారు.
ఈ సమయంలో అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిలో ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. మరో వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. పట్టుబడిన వారి వివరాలు గంటల సూర్య తేజ (26), బురిడి లైకోన్ అలియాస్ దేవ్ (22), కేశవ బాలు (20)గా పోలీసులు తెలిపారు.
వారి వద్ద ఉన్న స్కూటీ డిక్కీని తనిఖీ చేయగా రెండు ప్లాస్టిక్ ప్యాకెట్లలో గంజాయి లభ్యమైంది. అలాగే కేశవ బాలు జేబులో ఉన్న పాలిథిన్ కవర్లో మరో గంజాయి ప్యాకెట్ కనిపించింది. మొత్తం మూడు ప్యాకెట్లలో 2.3 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పట్టుబడిన వారు తరచూ ఆ ప్రదేశానికి వచ్చి గంజాయి సేవిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అరకు ప్రాంతానికి చెందిన బురిడి లైకోన్ కిలోకు రూ.3,000 చొప్పున గంజాయి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరారైన సోపెటీ కార్తీక్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు జె ఆర్ పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అవతారం తెలిపారు.
