ఎంఎంటీఎస్ సేవల మెరుగుదలకు సీఎం ఆదేశాలు
ఎంఎంటీఎస్ సేవల మెరుగుదలకు సీఎం ఆదేశాలు
- - కార్యాలయ సమయాల్లో సర్వీసుల పెంపు – సమయపాలనపై దృష్టి
- - లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపరచాలని సూచనలు
- - ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి
హైదరాబాద్, మార్చి 26 (పీపుల్స్ మోటివేషన్): హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కార్యాలయ సమయాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంచడంతో పాటు క్రమం తప్పకుండా సమయపాలన పాటిస్తూ సేవలను నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
శాసనసభ మండలి హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఎంఎంటీఎస్ సేవలపై సమగ్రంగా ఆరా తీశారు. ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి గల కారణాలను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడం, స్టేషన్లు లోపల ఉండటం వల్ల రాకపోకల్లో ఇబ్బందులు ఉన్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో స్టేషన్లకు చేరుకునేందుకు మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. శుభ్రత, భద్రత, సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. మెరుగైన వసతులు ఉన్నప్పుడే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు ఆకర్షితులవుతారని పేర్కొన్నారు.
స్వీయ ఆదాయ వనరులను పెంచుకునేందుకు కూడా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రకటనలు, వాణిజ్య కార్యకలాపాల ద్వారా ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను ఆర్థికంగా బలపరచడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా హాజరై ఎంఎంటీఎస్ సేవల అభివృద్ధిపై చర్చించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ప్రయాణికుల సంఖ్య పెంపు కోసం సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
