విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత: సీఎం రేవంత్ రెడ్డి
విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత: సీఎం రేవంత్ రెడ్డి
- పేదల వైద్యం కోసం భారీ నిధులు – 4,500 కోట్లు ఖర్చు
- ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా విస్తృత సహాయం
- 1.15 కోటి కుటుంబాలకు జీవిత బీమా పథకం
హైదరాబాద్, మార్చి 26 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైతే మరిన్ని నిధులు సమకూర్చుతామని స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం జోక్యం చేసుకుని పలు అంశాలను వివరించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల వైద్యానికి ఎక్కడా నిధుల కొరత లేకుండా అత్యధికంగా ఖర్చు చేసినట్టు తెలిపారు. గత 27 నెలల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓసీ రూపంలో అందించిన సహాయంపై గణాంకాలను వెల్లడించారు.
పేదల వైద్యానికి తమ ప్రభుత్వం రూ. 4,500 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఇందులో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 2,046 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 2,400 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. గతంతో పోలిస్తే నెలవారీ ఖర్చు గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణలోని 1.15 కోటి కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. పేదల్లో ధైర్యం కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. సామాజిక, ఆర్థిక సర్వే ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్టు సీఎం తెలిపారు. గత ప్రభుత్వ బకాయిలను భరిస్తూనే తమ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సంస్కరణలు చేపట్టిందని చెప్పారు. ఆసుపత్రులకు వేల కోట్లు చెల్లించి వ్యవస్థను బలోపేతం చేసినట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో నిమ్స్, టిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు కొత్తగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. మొత్తం 10 వేల పడకల సామర్థ్యంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని సీఎం స్పష్టం చేశారు.
