పిల్లల హక్కుల పరిరక్షణలో సమాజం భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి
పిల్లల హక్కుల పరిరక్షణలో సమాజం భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి
- చైల్డ్ ప్రొటెక్షన్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఎమ్మెల్యే
- పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై ఆందోళన
- ప్లే గ్రౌండ్లు లేని పాఠశాలలకు అనుమతులు ఇవ్వొద్దని సూచన
గుంటూరు, 7 మార్చి (పీపుల్స్ మోటివేషన్): పిల్లల హక్కుల పరిరక్షణలో సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని ఐటీసీ వెల్కమ్ హోటల్లో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ రైట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన చైల్డ్ ప్రొటెక్షన్ కాన్ఫరెన్స్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గళ్ళా మాధవి పిల్లల భద్రత, సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
సోషల్ మీడియా మరియు అధిక స్క్రీన్ టైం పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వర్కింగ్ పేరెంట్స్ జీవన విధానం కారణంగా పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లతో గడుపుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకప్పుడు పిల్లలు బయట ఆడుకుంటూ సమయం గడిపేవారని, ఇప్పుడు మాత్రం ఇంట్లోనే ఉండే పిల్లలను బయటకు వెళ్లి ఆడమని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పిల్లల మానసిక, శారీరక వికాసానికి ఆటపాటలు ఎంతో అవసరమని గళ్ళా మాధవి అన్నారు. అయితే చాలా పాఠశాలల్లో ప్లే గ్రౌండ్లు లేకపోవడం ఆందోళనకర విషయమని పేర్కొన్నారు. ప్లే గ్రౌండ్ లేని పాఠశాలలకు అనుమతులు ఇవ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు కేవలం కుటుంబాల భవిష్యత్తు మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును మోసే పౌరులని ఆమె పేర్కొన్నారు. వారికి బాధ్యతాయుతమైన బాల్యాన్ని అందించడానికి సమాజం మొత్తం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లల హక్కులు, విద్య, భద్రత వంటి అంశాలపై అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
