ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
- కడప స్టీల్ ప్లాంట్కు భూ కేటాయింపు
- గిరిజన రైతులకు భారీ సబ్సిడీలు
- జల జీవన్ మిషన్కు వేల కోట్ల ఆమోదం
అమరావతి, 13 మార్చి (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జల జీవన్ మిషన్, పోలవరం ప్రాజెక్టు పనుల వేగవంతం, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూకేటాయింపులు, గిరిజన రైతులకు సబ్సిడీలు, ఉద్యోగినుల కోసం హాస్టళ్లు వంటి అనేక ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని పలు గ్రామాల్లో 424.45 ఎకరాల ప్రభుత్వ భూమిని జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థకు కేటాయించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. రూ.21.30 కోట్ల చెల్లింపుతో ఈ భూమిని ఏపీఐఐసీకి బదలాయించి, రెండేళ్లలో ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అదనంగా కిమ్స్ ఆసుపత్రి, విద్యాసంస్థలు, పర్యాటక అభివృద్ధి, ఈఎస్ఐసీ ఆసుపత్రి నిర్మాణం కోసం పలు ప్రాంతాల్లో భూములను కేటాయించారు.
గిరిజన రైతులకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటవీ హక్కు పత్రాలు ఉన్న రైతులకు ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ పథకం కింద డ్రిప్ ఇరిగేషన్పై 100 శాతం, స్ప్రింక్లర్లపై 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. కొండ ప్రాంతాల్లో సాగు చేసే రైతులకు నీటి వనరుల సమస్యను తగ్గించి దిగుబడులు పెంచేందుకు ఈ చర్యలు దోహదపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నీటి కాలుష్య నివారణ, నియంత్రణ సవరణ చట్టం-2024ను రాష్ట్రంలో అమలు చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చిన్న ఉల్లంఘనలకు జైలు శిక్షల స్థానంలో జరిమానాలు విధించేలా ఈ చట్టంలో మార్పులు చేయనున్నారు. దీంతో పరిశ్రమలపై భారం తగ్గడంతో పాటు కేంద్ర నిధులు పొందే అవకాశం కూడా ఉంటుంది.
ఉద్యోగాలు చేసే మహిళల కోసం ‘సఖీ నివాస్’ పేరుతో 30 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ హాస్టళ్లలో సురక్షిత వసతులతో పాటు చిన్న పిల్లల కోసం శిశు సంరక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగినులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నారు. జీఎస్టీ వివాదాల పరిష్కారానికి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో మూడు అప్పిలేట్ ట్రైబ్యునల్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. దీనివల్ల కేసులు త్వరగా పరిష్కారమై రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం సకాలంలో అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జల జీవన్ మిషన్ పథకం అమలుకు రూ.9,355 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులకు పరిపాలన ఆమోదం ఇచ్చింది. అదనంగా 3000 నివాస ప్రాంతాలకు రూ.1,814.71 కోట్లతో తాగునీటి పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 76 మండలాల్లోని సుమారు 65 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
రాష్ట్రంలో మూడు కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, ఏలూరు జిల్లా నూజివీడు, శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతాల్లో భూములను కేటాయించారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు మూడో గ్యాంట్రీ క్రేన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు పనుల కోసం అదనంగా రూ.47 కోట్లకు పైగా వ్యయానికి మంత్రివర్గం అనుమతి తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.
