తిరుమల సేవల్లో సాంకేతిక విప్లవం..
తిరుమల సేవల్లో సాంకేతిక విప్లవం..
- భక్తులకు అత్యున్నత సౌకర్యాలే లక్ష్యం
- ఆలయ పవిత్రత కాపాడటమే ప్రధాన లక్ష్యం
- ప్రసాదాల నాణ్యతపై కఠిన పర్యవేక్షణ
- దర్శనంలో ఏఐ వినియోగంతో సౌలభ్యం
- సీఎం చంద్రబాబు నాయుడు
తిరుమల, మార్చి 21 (పీపుల్స్ మోటివేషన్): కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను కాపాడుతూ భక్తుల విశ్వాసానికి మరింత బలం చేకూర్చేలా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుమలలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో టీటీడీ అధికారులకు ఆయన కీలక దిశానిర్దేశాలు చేశారు. భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, వారికి ఇబ్బందులు లేకుండా సక్రమంగా సేవలు అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
ప్రసాదాల తయారీలో నాణ్యతకు ఎలాంటి రాజీ పడకూడదని సీఎం స్పష్టం చేశారు. నెయ్యి, పప్పులు, ఇతర ముడి పదార్థాలన్నీ కచ్చితమైన ప్రమాణాలతో ఉండేలా ఏర్పాటు చేసిన ఆధునిక ప్రయోగశాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రసాదాల విషయంలో భక్తుల విశ్వాసం అత్యంత ముఖ్యమని, కల్తీకి ఏమాత్రం అవకాశం ఉండకూడదని హెచ్చరించారు. ప్రతి దశలో నాణ్యత పరీక్షలు నిర్వహించి, ప్రమాణాలు పాటించేలా చూడాలని సూచించారు.
భక్తులు క్యూలైన్లలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు సాంకేతికతను వినియోగించాలని సీఎం సూచించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టి దర్శన ప్రక్రియను వేగవంతం చేయాలని, రద్దీ నియంత్రణలో ఆధునిక విధానాలు అమలు చేయాలని పేర్కొన్నారు. భక్తులకు సమయం ఆదా కావడంతో పాటు, సౌకర్యవంతమైన దర్శన అనుభవం కల్పించడమే లక్ష్యంగా ఉండాలని చెప్పారు. అన్నప్రసాద సేవలను మరింత విస్తరించాలన్న దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం తిరుమలతో పాటు 57 దేవాలయాల్లో అన్నప్రసాదం అందిస్తున్నామని అధికారులు వివరించగా, త్వరలోనే మరో నాలుగు దేవాలయాల్లో ఈ సేవను ప్రారంభించనున్నట్లు తెలిపారు. భక్తులకు నాణ్యమైన భోజనం అందించడం ద్వారా వారి యాత్ర అనుభవాన్ని మరింత మెరుగుపరచాలని సీఎం ఆకాంక్షించారు.
తిరుమలలో భక్తులకు అందించే అన్ని సేవలను సమగ్రంగా పర్యవేక్షిస్తూ, ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. భద్రత, పరిశుభ్రత, తాగునీరు, వసతి వంటి అంశాల్లో కూడా అత్యున్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రజాప్రతినిధులు, టీటీడీ ఉన్నతాధికారులు, తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. మొత్తంగా తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
