అమరావతికి చట్టబద్ధతకు పావన్ కల్యాణ్ మద్దతు
అమరావతికి చట్టబద్ధతకు పావన్ కల్యాణ్ మద్దతు
- శాసనసభలో తీర్మానంపై కీలక ప్రసంగం
- రైతుల త్యాగాలను గుర్తుచేసిన ఉప ముఖ్యమంత్రి
- శాశ్వత రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతు
అమరావతి, మార్చి 28 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాసనసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం మెజారిటీ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని స్పష్టం చేశారు.
2019లో ప్రభుత్వం మారిన తరువాత మూడు రాజధానుల ప్రతిపాదనతో పరిస్థితి మరింత సంక్లిష్టమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర అభివృద్ధి దిశలో అనిశ్చితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాజధాని అంశంపై స్పష్టత లేకపోవడం ప్రజల్లో ఆందోళనకు దారితీసిందని అన్నారు.
భూములు ఇచ్చిన రైతులపై గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. రైతుల త్యాగాలను గుర్తించి వారికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం కేవలం పరిపాలనా అంశం మాత్రమే కాకుండా, రైతుల ఆత్మగౌరవంతో కూడిన అంశమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతుతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్థిరమైన పాలన అందిస్తోందని ఆయన అన్నారు. అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని అభిప్రాయపడ్డారు.
మొత్తంగా అమరావతి రాజధాని అంశంపై రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల విశ్వాసం కోసం ఈ తీర్మానం కీలక మలుపుగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
