కాజీపేట రైల్వే డివిజన్ కోసం కేటీఆర్ లేఖ
కాజీపేట రైల్వే డివిజన్ కోసం కేటీఆర్ లేఖ
- తక్షణ ఏర్పాటుకు కేంద్రాన్ని కోరిన కేటీఆర్
- పార్టీ ఎంపీల బృందం ద్వారా లేఖ అందజేత
- సానుకూలంగా స్పందించిన అశ్విని వైష్ణవ్
హైదరాబాద్, ఏప్రిల్ 1 (పీపుల్స్ మోటివేషన్): తెలంగాణలో కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. ఈ లేఖను పార్టీ ఎంపీల బృందం స్వయంగా కేంద్ర మంత్రికి అందజేయగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
కేటీఆర్ తన లేఖలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణ కారణంగా సికింద్రాబాద్ డివిజన్పై పనిభారం విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ డివిజన్ పరిధి 2,755 ట్రాక్ కిలోమీటర్లుగా ఉండగా, భవిష్యత్తులో ఇది 3,150 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇది సాధారణ పరిపాలనా పరిమితిని మించి ఉందని ఆయన వివరించారు.
విజయవాడ, గుంతకల్ వంటి డివిజన్లు సుమారు 2,200 కిలోమీటర్ల పరిధి కలిగి ఉండగా, గుంటూరు డివిజన్ కేవలం 900 కిలోమీటర్లలోపే ఉందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ అసమతుల్యత వల్ల సికింద్రాబాద్ డివిజన్ నిర్వహణ క్లిష్టంగా మారిందని, రైళ్ల రాకపోకలపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.
కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తే కార్యకలాపాల వికేంద్రీకరణ జరిగి, ఉత్తర మరియు తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో రైల్వే సేవలు మెరుగుపడతాయని కేటీఆర్ తెలిపారు. ఈ డివిజన్ పరిధిలో కాజీపేట–బల్లార్షా, పెద్దపల్లి–నిజామాబాద్, కాజీపేట–ఎర్రుపాలెం, డోర్నకల్–మనుగూరు, సత్తుపల్లి మార్గాలను చేర్చాలని సూచించారు.
రైల్వే శాఖ పరిశీలిస్తున్న కొన్ని మార్పులపై కూడా కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెద్దపల్లి–నిజామాబాద్ సెక్షన్ను హైదరాబాద్ డివిజన్కు బదిలీ చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భౌగోళికంగా సమీపంలో ఉండే ఈ మార్గాన్ని కాజీపేట డివిజన్లోనే ఉంచాలని సూచించారు. అలాగే లాతూర్ రోడ్–పర్లీ వైజనాథ్ మార్గాన్ని నాందేడ్ డివిజన్కు మార్చే అంశాన్ని కూడా పునఃపరిశీలించాలని కోరారు. కాజీపేట ఇప్పటికే ప్రధాన రైల్వే మార్గాల కూడలిగా ఉండడంతో పాటు రైల్వే తయారీ యూనిట్, మెయింటెనెన్స్ కేంద్రాలు ఉండటం వల్ల జాతీయ స్థాయిలో కీలక హబ్గా అభివృద్ధి చెందే అవకాశముందని పేర్కొన్నారు.
సింగరేణి బొగ్గు, సిమెంట్, ఎరువులు, ధాన్యాల రవాణా ద్వారా ఈ ప్రాంతం నుంచి రైల్వేకు భారీ ఆదాయం వస్తుందని కేటీఆర్ తెలిపారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రాంతానికి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్పై ఉన్న అధిక భారం కారణంగా నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని, భద్రతా పర్యవేక్షణలో కూడా సవాళ్లు ఎదురవుతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు పరిష్కారంగా కాజీపేట డివిజన్ ఏర్పాటే సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు.
