Dasara: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు?
Dasara: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు?
దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. విజయదశమి రోజున శ్రీరాముడు లంకాపతి రావణుని సంహరించాడు. ఇది కాకుండా, విజయదశమి పండుగ దుర్గమాతతో కూడా ముడిపడి ఉంటుంది. ఈ రోజున దుర్గామాత మహిషాసురుడిని సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. దసరా పండుగను ప్రతి సంవత్సరం అశ్విన్ మాసం శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. విజయదశమి రోజున దేశవ్యాప్తంగా రావణ దహనం జరుగుతుంది. అలాగే ఆయుధాలను పూజించే సంప్రదాయం కూడా ఉంది. దసరా రోజున రావణ దహనం, ఆయుధ పూజల గురించిజమ్మి చెట్టును భక్తులు పూజిస్తారు. అలాగే ఈ పండగ రోజు.. పాలపిట్టను సైతం చూడాలంటారు..
విజయదశమి సర్వ విజయాలకు నాంది. ఈ రోజు ఏ పనిని ప్రారంభించినా విజయం తధ్యం. విజయదశమి రోజునే శ్రీరాముడు లోకకంటకుడైన రావణ సంహారం చేసాడు. అందుకే ఈ రోజు ప్రజలు శ్రీరాముని విజయానికి సంకేతంగా రావణ దహనం కూడా చేస్తారు.
పాలపిట్ట శుభసూచికంగా...
దసరా రోజు పాలపిట్ట కనిపిస్తే..శుభసూచికంగా భక్తులు భావిస్తారు. ఆ క్రమంలోనే శమీ పూజ అనంతరం పాలపిట్టను చూసేందుకు భక్తులు ఆరాట పడతారు. ఈ పాలపిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్దికి సంకేతంగా సూచిస్తారు. ఈ పక్షి పరమేశ్వరుడిని ప్రతి రూపంగా భావిస్తారు. అందుకే దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే అన్ని శుభాలే జరుగుతాయని భక్తులు గాఢంగా నమ్ముతారు.
అయితే ఈ భక్తుల నమ్మకం వెనుక పురాణగాథలు సైతం ప్రాచుర్యంలో ఉన్నాయి. త్రేతాయుగంలో రావణాసురుడితో శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరిన సమయంలో విజయ దశమి రోజు పాలపిట్ట ఎదురుగా కనిపిస్తుంది. ఈ యుద్ధంలో రాముడు విజయం సాధిస్తాడు. దీంతో పాలపిట్టను శభ సూచికంగా శ్రీరాముడు భావించారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక మహాభారతంలో అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు జమ్మి చెట్టు మీద పాండవులు తమ ఆయుధాలను దాచి ఉంచుతారు.
ఈ ఆయుధాలను ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపాలా కాశాడని పురాణలు పేర్కొంటున్నాయి. అలాగే అజ్జాత వాసాన్ని సైతం ముగించుకుని పాండవులు హస్తినాపురానికి వెళ్తున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందని వివరిస్తున్నారు. నాటి నుంచి పాండవుల కష్టాలు తీరిపోయాయని వారు చెబుతున్నారు. అంటే కురుక్షేత్రంలో విజయం సాధించడమే కాదు.. మళ్లీ తిరిగి పాండవులు రాజ్యాన్ని సైతం చేజిక్కించుకున్నారు. అందుకే దసరా పర్వదినం రోజు పాలపిట్టను చూస్తే.. మంచి జరుగుతుందని అమ్మవారి భక్తులు గాఢంగా విశ్వసిస్తారు. పురాణాల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ పాలపిట్టనే.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అధికార పక్షిగా నిర్ణయించాయి. ఈ పక్షిని.. నీలకంఠం పక్షి అని కూడా అంటారు.