E-Shram: ఈ-శ్రమ్ కార్డు ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత
E-Shram: ఈ-శ్రమ్ కార్డు ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత
జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేయించండి
-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, ఫిబ్రవరి 20: ఈ-శ్రమ్ కార్డు ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుందని, జిల్లాలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు..
గురువారం ఉదయం ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ అంశంపై కార్మిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమల శాఖ, మత్స్య శాఖ, డిఆర్డిఏ, మెప్మా, డ్వామా, వ్యవసాయ, ఐసిడిఎస్ శాఖల అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రమ్ కార్డు అవసరమైన సమయాల్లో ఆసరా గా నిలుస్తుందన్నారు. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.. అసంఘటిత రంగాలలో పనిచేసే కార్మికులకు యాక్సిడెంట్ లేదా మరణాలు సంభవించినప్పుడు, అసహాయ పరిస్థితుల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ఈ-శ్రమ్ కార్డు తగిన సాయం అందించే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు..ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకున్న అసంఘటిత రంగ కార్మికులకు ప్రమాదాలు జరిగినపుడు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షల ప్రమాద, మరణ, అంగవైకల్య బీమా ఉచితంగా లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.. కాబట్టి అసంఘటిత రంగ కార్మికులందరూ ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు..16 నుండి 59 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నవారు, ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి రానివారు, ఈఎస్ఐ, ఈపిఎఫ్ సదుపాయం లేని అసంఘటిత కార్మికులు అందరూ నమోదుకు అర్హులని, ఉచితంగా ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
వ్యవసాయ మరియు అనుబంధ శాఖల్లో ఉన్న ఉపాధి పనుల వారు, చిన్న, సన్న కారు రైతులు, వ్యవసాయ కూలీలు, నర్సరీలలో పనిచేసే వారు, పాడి పరిశ్రమలో పనిచేసే కార్మికులు, మత్స్య కార్మికులు, తాపీ మేస్త్రీలు, రాళ్లు కొట్టేవారు, సెంట్రింగ్, ప్లంబింగ్, పెయింటర్, ఎలక్ట్రిషన్, వెల్డింగ్, ఉపాధి వర్కర్లు, ఆశా వర్కర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, మిడ్ డే మిల్ వర్కర్లు, తదితరులందరూ అసంఘటిత రంగ కార్మికుల కిందకు వస్తారని కలెక్టర్ తెలిపారు..
అలాగే ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు ఉన్న వారిని, ఆశా వర్కర్లను, స్వయం సహాయక సంఘాల సభ్యులను, ఫిషర్మెన్ అసోసియేషన్ వారితో మాట్లాడి మత్స్య కార్మికులను, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో లో డ్రైవర్లు, ఆటో డ్రైవర్ లు, పారిశుధ్య కార్మికులు, చిన్న, సన్న కారు రైతులను, అంగన్వాడి హెల్పర్, ఆయా లను, జల వనరుల శాఖ కాంట్రాక్ట్ లేబర్, చేనేత, కమ్మరి, కుమ్మరి కార్మికులు, మిడ్ డే మిల్ వర్కర్లను, ప్రైవేట్ పాఠశాలల్లో నాన్ టీచింగ్ స్టాఫ్, బ్యూటీ పార్లర్ లో పనిచేసే వారిని, హమాలీలను అందరినీ ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు... గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వీరిని నమోదు చేయించాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను, ఎంపిడిఓ లను, మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు... అసంఘటిత రంగ కార్మికులందరికీ సాయం చేస్తున్నామనే భావంతో ఈ అంశాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ప్రతి ఒక్కరిని ఈ శ్రమ్ పోర్టల్ లో నమోదు చేయించాలన్నారు. మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించాలని కలెక్టర్ కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించారు .. వచ్చే సమావేశం నుండి నిర్దేశించిన లక్ష్యాల వారిగా పురోగతిపై సమీక్ష చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. టెలి కాన్ఫరెన్స్ లో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.