Anganwadi: రాష్ట్రవ్యాప్తంగా 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Anganwadi: రాష్ట్రవ్యాప్తంగా 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
• అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
• సంబంధిత అధికారులతో సమీక్షలో మంత్రి సీతక్క నిర్ణయాలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మార్చి 08 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. అదే రోజు అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399, హెల్పర్ పోస్టులు 7,837 కలిపి 14,236 పోస్టుల భర్తీకి మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సమయం కాగానే జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇన్ని ఉద్యోగాల భర్తీకి చేయడం ఇదే తొలిసారి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, చిన్నారులకు పూర్వప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయ, సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరి..
రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరిగా ఉండాలి. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొంది. 65 ఏళ్ల వయసు నిండిని పలువురు పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో 65 ఏళ్ల వయసు దాటిన టీచర్లు 3,914 మంది ఉన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవీ విరమణ చేయనున్నందున ఆ పోస్టులనూ నోటిఫికేషన్లలో ప్రభుత్వం పేర్కొంది.
టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత..
గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు పొందాలంటే కనీసం పదో తరగతి పాసై ఉండాలి. కానీ ప్రస్తుతం కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాసైన అనుభవం ఉండాలి. దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్లుగా కేంద్రం పేర్కొంది.
ఇంటర్మీడియట్ పాసైన వారికి టీచర్లుగా పదోన్నతి..
కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీలో 50 శాతం సహాయకులకు కేటాయించాలి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సహాయకుల్లో టీచర్లుగా పదోన్నతి పొందేందుకు చాలా మందికి విద్యార్హతలు లేవు. ఇంటర్మీడియట్ పాసైన హెల్పర్లు 567 మంది మాత్రమే ఉన్నట్లు శిశు సంక్షేమశాఖ గుర్తించింది. వారందరికీ పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి.
సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై శనివారం మంత్రి సీతక్క సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమానికి వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల గురించి తెలియజేశారు.
మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీ
దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందిస్తామని సీతక్క తెలిపారు. పలు రాష్ట్రాల్లో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా సహకార అభివృద్ధి సంస్థ, తెలంగాణ సాంస్కృతిక సారథి, సంగీత నాటక అకాడమీల ఛైర్పర్సన్లు శారద, శోభారాణి, వెన్నెల, అలేఖ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్కుమార్, సంచాలకురాలు సృజన, సెర్ప్ సీఈఓ దివ్య, స్పెషల్ కమిషనర్ షఫీయుల్లాలు పాల్గొన్నారు.
ఈ నెల8న నిర్వహించే ఇతర కార్యక్రమాలు..
• మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొదటి విడతలో కొనుగోలు చేసిన 50 ఆర్టీసీ అద్దె బస్సులు ప్రారంభం చేయనున్నారు.
• 31 జిల్లాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలతో ఒప్పందాలు.
• పేదరిక నిర్మూలన కోసం పురపాలికలు, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరుగా పనిచేస్తున్న మెప్మా, సెర్ప్ల విలీన నిర్ణయ ప్రకటన.
• మహిళా ప్రాంగణాల్లో డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు సబ్సిడీ ఆటోల పంపిణీ చేయనున్నారు.
• రాష్ట్రంలోని జిల్లాలో 64 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లకు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు.