రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రండి.. పరిక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

రండి.. పరిక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి..

  • ఢిల్లీ సీఐఐ వార్షిక సదస్సులో పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
  • రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన ఏపీ సీఎం
  • అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపు
  • 2026 జనవరికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ సిద్దమని ప్రకటన
  • ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉత్పత్తుల తయారీకి పారిశ్రామిక వేత్తలు సిద్ధం కావాలన్న చంద్రబాబు
  • సీఎం సమాధానాలపై పారిశ్రామిక వేత్తల హర్షం.. స్టాండింగ్ ఓవేషన్ తో గౌరవించిన సీఐఐ ప్లీనరీ.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఢిల్లీ వేదికగా జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆర్థికాభివృద్ధి - సుస్థిరత - ఆంధ్రప్రదేశ్ బ్లూప్రింట్ అనే అంశంపై సీఐఐ స్పెషల్ ప్లీనరీ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇదే సందర్భంలో పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. రూపొందించిన విధానాలను సీఎం వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ -2047లో పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కోరుతున్నట్టు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "ప్రస్తుతం సీబీఎన్ అనే బ్రాండ్ ద్వారా ఏపీకి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాం. క్రెడిబిలిటి అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. ఏపీకి రండి.. పరీక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి. 2026 దేశంలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు అవుతుంది. దీన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలి. క్యాంటం కంప్యూటింగ్ విస్తృతం అవుతోంది. డ్రోన్స్, ఐఓటీ, సెన్సార్లు ఇలా వివిధ రకాల సాంకేతికతతో రియల్ టైమ్ డేటా అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం ఈ రంగాల్లో పెట్టుబడిదారులు అవసరం. భవిష్యత్తులో ఈ రంగానికి మంచి డిమాండ్ ఉంది. దీనికి అమరావతి కేంద్రం కానుంది. టీసీఎస్,ఐబీఎం,ఎల్ అండ్ టీ సంస్థలు సంయుక్తంగా అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నదే మా నినాదం. బీపీసీఎల్ రిఫైనరీ రామాయపట్నం వద్ద వస్తోంది. డేటా సెంటర్ , అనలటిక్స్ తో కూడిన క్యాంపస్ విశాఖలో ఏర్పాటు చేయాలని గూగుల్ ను ఆహ్వానించాం. పారిశ్రామిక వేత్తలు ఎవరు వచ్చినా వారికి ఎర్రతివాచీతో ఆహ్వానం పలుకుతాం. ధరఖాస్తు పెట్టినప్పటి నుంచి భూ కేటాయింపు, ఇతర అనుమతులివ్వటం మా బాధ్యత. రికార్డు టైములోనే అన్ని క్లియరెన్సులు ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాం. ఏపీలో ఇప్పుడు సౌర,పవన,పంప్డ్ ఎనర్జీ లాంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కేంద్రంగా మారుతోంది. పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రంగాల్లో వస్తున్నాయి. రాయలసీమలో కొత్తగా హైటెక్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం. ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. అమరావతిలో ఫ్యూచర్ లీడర్లను తయారు చేయడం కోసం గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాం." అని చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు వివరించారు.

నాడు.. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రమోట్ చేయడమే నా అజెండా..

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీని ప్రమోట్ చేసిన విషయాలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. "దావోస్ లాంటి చోట్లకు వెళ్తే ఓట్లు రావు కొందరు చెప్పారు. ఉమ్మడి ఏపీకి పెట్టుబడులు తేవాలనే లక్ష్యంతో ఓట్ల గురించి పట్టించుకోకుండా నేను ధైర్యం చేసి వెళ్లాను. 1995 నుంచి నిరంతరం దావోస్ లో ప్రపంచ ఆర్ధిక సదస్సుకు హజరు అవుతునే ఉన్నా. ప్రజా జీవితంలో ఉన్న వారు ప్రజల సంపద పెంచడానికి చూడాలి. సంపద పెరిగితేనే ప్రజలకు తిరిగి ఇవ్వగలం, సంపద సృష్టిస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలం. నాడు హైదరాబాదులో సీఐఐ సహకారంతో ఓ గ్రీన్ బిల్డింగ్ ను నిర్మించగలిగాం. సీఐఐ భాగస్వామ్యంతో పెట్టుబడుల సదస్సులు చాలా సార్లు నిర్వహించగలిగాం. హైదరాబాద్ ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. దేశంలోనే అత్యంత ఎక్కువ తలసరి ఆదాయంగా ఉన్న నగరంగా ఉంది ఆదాయం సమకూరుస్తోంది. నేను పరిశ్రమల్ని ప్రోత్సహించే వ్యక్తిని సీఐఐ నుంచి ఒక పరిశ్రమ- పెట్టుబడి వచ్చినా మాకు మంచిదే. 1991లో మనం ఆర్ధిక సంస్కరణలు మొదలు పెట్టాం. ఆ సమయంలో తప్పనిసరిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావును కూడా నేను అభినందిస్తాను. 1990 తర్వాత సమాచార విప్లవం, ఇంటర్నెట్ విప్లవం మొదలైంది. ఏపీలో నాడు తీసుకున్న సంస్కరణల వల్ల ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఐటీ నిపుణుల్లో 30 శాతం మంది తెలుగువారే కనిపిస్తారు. సాంకేతికతను అందిపుచ్చుకున్న తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు. ఇది నేను అరెస్టైన సమయంలో 80 దేశాల్లో పని చేసే ఐటీ ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారు. అప్పుడే తెలుగువారు ఇన్ని దేశాల్లో పని చేస్తున్నారని ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడూ అదే పని ఉన్నా.. విభజన ఆంధ్రప్రదేశ్ ను ప్రమోట్ చేస్తున్నా. హైదరాబాదును అభివృద్ధి చేసిన నాకు ఇప్పుడు అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం వచ్చింది. ఓ గ్లోబల్ గ్రీన్ సిటిగా అమరావతిని నిర్మిస్తున్నాం. ఇందులో పరిశ్రమలు భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. వచ్చే 22 ఏళ్లకు ఇప్పుడే ప్రణాళికలు చేస్తున్నాం. 15 శాతం వృద్ధి రేటు సాధించటమే మా లక్ష్యం. మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ కు మాత్రమే పరిమితం కాకూడదు. తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చాలన్నదే మా విజన్. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాం.

ప్రపంచంలో అగ్రభాగాన భారత్..

ప్రపంచంలో భారత్ ను ఆర్థిక శక్తిగా ఎదిగేలా ప్రధాని మోడీ చేసిన కృషిని.. తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు వివరించారు. "భారత్ కు చెందిన పారిశ్రామికవేత్తలే ప్రపంచం మొత్తానికి సాంకేతిక సేవలు అందిస్తారనటంలో సందేహం లేదు. మన దేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీ ఉండడం అత్యంత సానుకూలమైన అంశం. ప్రస్తుతం 4 అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఉంది. మరికొన్నేళ్లలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంటాం. అప్పుడు మనకు పోటీయే ఉండదు. పాలనలో అత్యుత్తమమైన విధానాలు అవసరం అవుతాయి. మంచి విధానాలు ఉంటే భారత్ ను ఎవరూ చేరుకోలేరు. చైనా, అమెరికా లాంటి దేశాలు పోటీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉత్పత్తుల నాణ్యతపై మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో మన పరిశ్రమలు, ఐటీ ఉత్పత్తులు ఉంటేనే మనం రాణించగలం. గతంలో ఐటీని విస్తృతంగా ప్రోత్సహించాను. కేవలం బీపీఓ రంగానికే పరిమితం కాకుండా ఐటీ ఉత్పత్తులపై దృష్టి పెట్టి ప్రపంచానికి అందించాం. ప్రస్తుతం ఐటీ లేదా, ఇతర మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తుల విషయంలో ప్రపంచ శ్రేణి ప్రమాణాలను అందుకోవటంలో కొంత వెనుకపడి ఉన్నాం. దీన్ని అధిగమిస్తే మనల్ని ఎవరూ అందుకోలేరు. గతంలో ఎంట్రప్రెన్యూర్స్ అంటే ఆంధ్రాప్రెన్యూర్స్ అనే పేరుంది. ఇప్పుడు భారత్ ప్రజలంటేనే ఎంట్రప్రెన్యూర్ అనే పేరు వచ్చింది.సాంకేతికత పెరిగి వర్చువల్ గా పనిచేసే సంస్కృతికి అలవాటు పడుతున్నాం. గంటల ప్రాతిపదికన కూడా ఆదాయం వచ్చేలా ఉపాధి అవకాశాలు పెరిగాయి. సంపద సృష్టిలో స్టార్టప్ కంపెనీలు కీలకం. దీనికి అనుగుణంగా ఏపీలో విధానాలను రూపొందిస్తున్నాం.భారత్ కు ప్రస్తుతం అత్యుత్తమ సమయం - మోదీ లాంటి మంచి దార్శనిక నేత కూడా మనకున్నారు. రోటీన్ బిజినెస్ లు వద్దు.. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ, బిజినెస్ గ్లోబల్లీ అనేది మన విధానం కావాలని ఆకాంక్షిస్తున్నా.

వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తూ...

సీఐఐ వార్షిక ప్లీనరీలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. జాతీయ స్థాయిలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏపీలో ఏమేం చర్యలు తీసుకొంటున్నారన్న ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానమిస్తూ.. "మనకు నైపుణ్యం ఉన్న మానవ వనరులు చాలా అవసరం ఉంది. దీనికి అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు అవసరం అవుతాయి. నైపుణ్యాభివృద్ధి కోసం ఏపీలోనూ కొన్ని ఉత్తమ విద్య సంస్థలు వస్తున్నాయి. బిల్ గేట్స్ ఫౌండేషన్ తోనూ ఆరోగ్యం, వ్యవసాయం లాంటి అంశాలపై పనిచేస్తున్నాం. సాంకేతికత ఉంటేనే సరిపోదు దాన్ని క్షేత్రస్థాయిలో అమలు పరిస్తేనే ఫలితాలు వస్తాయన్నది నా విశ్వాసం. అందుకే ఏపీలో అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్నాం, ఏపీలో ఫలితాలు వస్తే దేశమంతా దాన్ని అనుసరించవచ్చు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ లాంటి వారి నుంచి ఆలోచనల్ని తీసుకుని నైపుణ్యాభివృద్ధి చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు ను ఏపీలో నిర్మిస్తున్నాం, సముద్రంలోకి వృధాగా పోయే 2 వేల టీఎంసీల నీటి నుంచి 200 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునేలా ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. ఇది పూర్తి అయితే రాష్ట్ర సస్యశ్యామలం కావడంతో పాటు.. సంపద అందరికీ అందుతుంది. వంశధార నుంచి పెన్నా వరకూ నదుల్ని కూడా అనుసంధానించాలన్నది మా ప్రయత్నం. అలాగే సర్క్యులర్ ఎకానమీ దిశగానూ ఏపీలో ప్రణాళికలు చేపడుతున్నాం. స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా సుస్థిర ఆర్ధిక వ్యవస్థను సాధించాలన్నది మా ప్రయత్నం.ఏపీ ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమే జీఎస్టీపీలో 35 శాతం వ్యవసాయం ద్వారానే వస్తోంది. అరకు కాఫీ ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ గా ఉంది . ఈ తరహా ఉత్పత్తులు ఉపాధిని సంపదను సృష్టిస్తాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలతో పాటు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో స్మార్ట్ వర్క్ అనేదే కీలకం, నైపుణ్యాలు పెంచుకోవటమే సరైన విధానం. గతంలో ఐటీ విప్లవం వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలు పోతాయని అపోహ ఉండేది. పర్యాటక రంగంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం, ఎక్కువ సంఖ్యలో హోటళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. వచ్చే ఐదేళ్లల్లో 50 వేల హోటల్ రూంలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా్ం. ప్రతీ సమయంలోనూ సవాళ్లు, అవకాశాలు ఉంటాయి అందులో అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఏపీని.. ఏపీలోని యువతను సిద్దం చేస్తున్నాం. అమరావతిలో పెద్ద ఎత్తున వివిధ నిర్మాణాలు జరగాల్సి ఉంది. నిర్మాణ రంగంతో పని చేయటానికి మేం సిద్ధం. వయబులిటి గ్యాప్ ఫండింగ్ వంటి విధానాల ద్వారా అభివృద్ధి, పీ-4-జీరో పావర్టీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా కృషి చేస్తున్నాం. 

స్టాండింగ్ ఓవేషన్ తో సీఎంకు గౌరవం..

సీఎం చంద్రబాబు చేసిన కీలక ప్రసంగానికి.. పారిశ్రామిక వేత్తలు అడిగిన వివిధ ప్రశ్నలకు సీఐఐ వార్షిక సదస్సు స్టాండింగ్ ఓవేషన్ తో గౌరవించింది. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, అధ్యక్షుడు సంజీవ్ పురి తదితరులు చంద్రబాబును సత్కరించారు.

Comments

-Advertisement-