రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

విద్యార్థులంతా కష్టపడి చదువుకుని భవిష్యత్తులో రాణించాలి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

విద్యార్థులంతా కష్టపడి చదువుకుని భవిష్యత్తులో రాణించాలి 

జీవితంలో తొలి మెట్టు ఎక్కబోతున్న విద్యార్థినీ విద్యార్థులంతా కష్టపడి చదువుకుని భవిష్యత్తులో మరింతగా రాణించి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఆకాంక్షించారు. చదువుకోవడం ద్వారా కుటుంబానికే కాకుండా, సొంత ఊరికి, రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తేవొచ్చని ఉద్భోదించారు.

 బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) ఆధ్వర్యంలోని ఎస్సీ గురుకులాల నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లాంటి ప్రఖ్యాత సంస్థల ప్రవేశాలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 10 వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు అవార్డుల బహూకరణ, ఉత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలకు ప్రోత్సాహకాలు అందించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు.

 శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్  ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి  ముందుగా ప్రాంగణంలో విద్యార్థుల చిత్రకళా గ్యాలరీని ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ, "అసమానతలు తొలగించి సమసమాజం నిర్మించాలన్న ఆనాటి పోరాటయోధుల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోంది. గురుకులాల్లో చదువుకుంటున్న మా పిల్లలు రేపటి రోజున ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కాంక్షిస్తున్నా.

 తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి  పేరును తెలుగు యూనివర్సిటీకి, మహిళా విద్యాలయానికి చాకలి ఐలమ్మ  పేరును, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ  పేరును.. ఇలా ఎందరో త్యాగమూర్తుల స్ఫూర్తితోనే సమసమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం పనిచేస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నాం.

ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువు చాలా ముఖ్యం. చదువులో మరో మెట్టు ఎక్కబోతున్న విద్యార్థుల ముందు రకరకాల రంగుల ప్రపంచం ఆకర్షణీయంగా ఉంటుంది. ఊహాగానాల్లో తిరగకుండా జీవితంలో 25 సంవత్సరాలు వచ్చే వరకు కష్టపడి చదువుకుంటే ఈ సమాజంలో గౌరవంగా బతకడానికి, భవిష్యత్తులో రాణించడానికి వీలవుతుంది. దారితప్పితే తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి వస్తుంది. చదువుకుంటే గ్రామం నుంచి రాష్ట్రం వరకు గర్వంగా బతికేలా చేస్తుంది.

వందేళ్ల చరిత్రలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తొలిసారి దళితుడిని వీసీగా నియమించాం. ఆ కోవలోనే సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీకి, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్‌గా, విద్యా కమిషన్ చైర్మన్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా గతంలో ఎప్పుడూ లేని విధంగా దళిత బిడ్డలు ఈ పదవులు చేపట్టారంటే వారికి కేవలం కులంతోనే అవకాశాలు రాలేదు. వారు ఉన్నత స్థాయిలో చదువుకుంటే వచ్చాయి.

దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు ఆత్మన్యూనతా భావాన్ని వీడాలి. ఆ లక్ష్యంతోనే రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడున్న గురుకుల పిల్లల్లో ప్రతిభ ఉంది. ఆత్మవిశ్వాసం ఉంది. భవిష్యత్తులో కచ్చితంగా రాణించగలుగుతారన్న నమ్మకం నాకుంది. కుటుంబానికే కాకుండా గ్రామానికి, దేశానికి పేరుప్రతిష్టలు తీసుకొస్తారు.

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నదని సంపూర్ణంగా విశ్వసించే వాడిని. కష్టపడి చదివితే రాణిస్తారు. మీరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నా. మీకెప్పుడూ తోడుగా ఉంటా. భవిష్యత్తులో రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా..." అని ముఖ్యమంత్రి  అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ , సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , షబ్బీర్ అలీ , పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.

Comments

-Advertisement-