బుడమేరు వరదకు శాశ్వత నివారణగా సిసివాల్
బుడమేరు వరదకు శాశ్వత నివారణగా సిసివాల్
• పనులు నత్తనడక సాగడంపై మంత్రి నిమ్మల సీరియస్.
• ఏజెన్సీకి నోటీసులు జారీ.
• సిసి వాల్ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు.
గతంలో బుడమేరు వరదకు పడిన మూడు గండ్లను కలుపుతూ నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు నత్తనడక సాగడంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు సార్లు స్వయంగా వచ్చి క్షేత్రస్దాయిలో పనులు పరిశీలించి, సీజన్ మొదలయ్యే నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పనులు నెమ్మదించడంతో ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం జలవనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, సిఈ సుగుణాకరరావులతో కలసి పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.
గతేడాది వచ్చిన బుడమేరు వరదల వల్ల విజయవాడ తీవ్రముంపుకు గురైందని, ఆగండ్లను పూడ్చడానికి గట్లపైనే ఉండి రాత్రింభవళ్ళు పనిచేశామని, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం పది రోజులు బస్సులోనే ఉండి పర్యవేక్షించారని గుర్తు చేశారు. గతంలో కూడా పులివాగుకు వరదలు వచ్చిన సమయంలో ఇదే ప్రాంతంలో పలు మార్లు గండ్లుపడ్డాయని అధికారులు, స్దానిక ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం గతంలో పడిన మూడు గండ్లను కలుపుతూ శాశ్వతప్రాతిపదికన సిసి వాల్ నిర్మాణం కొరకు 23 కోట్ల రూపాయల అగ్రిమెంట్ వాల్యూతో టెండర్లు కూడా పిలిచి పనులు కూడా చేపట్టడం జరిగిందని స్పష్టం చేశారు. ఐతే పనులు నెమ్మదిగా సాగుతుండటం, సరిపడినంత మెషినరీగానీ, సిబ్బంది గానీ లేకపోవడంతో ఏజెన్సీ, అధికారులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా పనులు పూర్తి చేయడానికి వీలుగా సరిపడినంత మెషినరీ గానీ, సిబ్బంది గానీ సమకూర్చుకుని మూడు షిప్ట్ లలో, రాత్రి పగలు, పనులు చేయాలని ఆదేశించారు. వర్క్ షెడ్యూల్ ను రోజువారీ వేసుకుని, ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తూ యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని హెచ్చరించారు.