రూ.3,673 కోట్లతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు
రూ.3,673 కోట్లతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు
- రెండవ దశలో 40వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్కుగాను ఇప్పటికే 36 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సిద్దం
- రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి, జూన్ 2: రాష్ట్ర రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో రూ.3,673 కోట్ల అంచనా వ్యయంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి ఎల్-1 టెండర్లను ఖరారు చేస్తూ సీఆర్డిఏ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రూ.882 కోట్లతో నిర్మించే జిఎడి టవర్ నిర్మాణాన్ని ఎన్.సి.సి., రూ.1,487 కోట్లతో నిర్మించే హెచ్.ఓ.డి. టవర్-1&2 నిర్మాణాన్ని షాపూర్జీ అండ్ పల్లంజీ మరియు రూ.1,304 కోట్లతో నిర్మించే హెచ్.ఓ.డి. టవర్-3&4 నిర్మాణాన్ని ఎల్ అండ్ టి కంపెనీలు దక్కించుకున్నాయని, త్వరలో నిర్మాణ పనులను కూడా ఆయా కంపెనీలు ప్రారంభిస్తాయని ఆయన తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన 48 వ సీఆర్డిఏ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగిందని, ఈ సమావేశంలో
రాజధాని అమరావతి అభివృద్ది పనులకు సంబంధించిన పలు టెండర్లను ఆమోదించడం జరిగిందన్నారు. ప్రజలు పలుచోట్లకు తిరుగకుండా ప్రజా పరిపాలన సులువుగా ఉండేందుకై పరిపాలన అంతా ఒకేచోట జరిగే విధంగా ఈ ఐదు టవర్ల నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందన్నారు. 2014-19 మద్య కాలంలో రూపొందించిన డిజైన్ల ప్రకారమే ఈ టవర్ల నిర్మాణాల పనులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
రెండో దశలో 40 వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్కు చర్యలు …….
హైదరాబాదులో నిర్మించిన షంషాబాద్ ఎయిర్ పోర్టు తరహాలో అమరావతిలో ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ ఎయిపోర్టును, 2,500 ఎకరాల్లో స్మార్టు ఇండస్ట్రీస్ను మరియు మరో 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా సిటీని నిర్మించేందుకు దాదాపు 10 వేల ఎకరాల భూమి కావాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఇందుకు కావాలసిన భూమిని రైతుల నుండి భూసేకరణ చేయాలా లేదా ల్యాండ్ పూలింగ్ ద్వారా సేవకరించాలా అనే నిర్ణయాన్ని ఇప్పటి వరకూ తీసుకోవడం జరగలేదన్నారు. ఇందుకై గ్రామసభలు నిర్వహిస్తూ రైతుల అభిప్రాయాన్ని సేవకరించడం జరుగుచున్నదన్నారు. ఈ గ్రామ సభలో రైతులు ల్యాండ్ పూలింగ్ కే మొగ్గుచూపుతున్నారని, ఇప్పటికే దాదాపు 36 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చేందుకు పలువురు రైతులు ముందుకు రావడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి కావలసిన 10 వేల ఎకరాలకు గాను రైతుల నుండి దాదాపు 40 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాల్సి ఉందని మంత్రి తెలిపారు.
ఇప్పటికే అమల్లో ఉన్న ల్యాండ్ పూలింగ్ చట్టంలోని నియమ నిబంధనల మేరకు 217 చ.కి.మి. కే అనుమతి ఉందని, ఈ పరిధిని మరింత పెంచేందుకు నేడు జరిగిన అథారిటీ సమావేశంలో ఆమోదం పొందడం జరిగరిదని ఆయన తెలిపారు. అదే విధంగా ఎడ్యుకేషన్ మరియు హెల్త్ ఇన్స్టిట్యూట్ల రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు పై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
రానున్న మూడు సంవత్సరాల్లో అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలోని అన్ని నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుందని, రెండో దశ ల్యాండ్ పూలింగ్ ను కూడా పూర్తిచేసి అభివృద్ది పర్చడం జరుగుతుందని మంత్రి తెలిపారు.