Shrasti Raghuvanshi: నీ లవర్ తో పారిపోవచ్చుగా.. నా అన్నను ఎందుకు చంపావ్?
Shrasti Raghuvanshi: నీ లవర్ తో పారిపోవచ్చుగా.. నా అన్నను ఎందుకు చంపావ్?
•కన్నీళ్లతో ప్రశ్నిస్తున్న రాజా రఘువంశీ సోదరి..
•ఏడు జన్మలు తోడుంటానన్నాడు, ఏడు రోజులు కూడా ఉండలేకపోయావా?
•సోషల్ మీడియాలో రాజా సోదరి శ్రస్తి రఘువంశీ ఆవేదన..
హనీమూన్ మర్డర్ కేసులో బాధిత కుటుంబం మనోవేదన
‘అగ్ని సాక్షిగా వివాహమాడిన భర్త కంటే లవరే ఎక్కువని అనుకుంటే అతడితోనే వెళ్లిపోవచ్చు కదా.. అన్యాయంగా నా అన్నను ఎందుకు చంపావ్?’ అంటూ రాజా రఘువంశీ సోదరి శ్రస్తి రఘువంశీ తన వదిన సోనమ్ ను ప్రశ్నించారు. రాజా హత్యతో తీవ్ర విషాదంలో మునిగిన రఘువంశీ కుటుంబం.. పోలీసుల విచారణలో బయటపడుతున్న వాస్తవాలతో వేదనకు గురవుతోంది. తన సోదరుడిని కిరాయి హంతకులతో వదినే చంపించిందని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు శ్రస్తి తెలిపారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా శ్రస్తి తన మనోవేదనను పంచుకున్నారు. సోనమ్ కు ఆమె ప్రియుడే ఎక్కువని అనుకుంటే ఇంట్లో నుంచి పారిపోయే అవకాశం ఉందని గుర్తుచేశారు. రాజా, సోనమ్ ఇద్దరిని అడిగి తెలుసుకున్నాకే తన తల్లిదండ్రులు వారికి వివాహం చేశారని చెప్పారు. అప్పటికే లవరు ఉన్నప్పుడు, లవర్ తోనే కలిసి ఉండాలని అనుకున్నపుడు సోనమ్ తన అన్నతో వివాహమాడిన ఎందుకు ఒప్పుకుందని శ్రస్తి ప్రశ్నించారు.
ఆమె తల్లిదండ్రులు బలవంతం చేస్తే పెళ్లికి ఒప్పుకుందని అనుకుంటే.. పెళ్లయ్యాక కూడా తన లవర్ తో పారిపోవచ్చు. కానీ సోనమ్ అవేమీ చేయకుండా అన్యాయంగా తన సోదరుడిని చంపించిందని శ్రస్తి ఆరోపించారు. "మా అన్నయ్య ఏడు జన్మలు తోడుంటానని సోనమ్ కు ప్రమాణం చేశాడు, కానీ ఆమె ఏడు రోజులు కూడా మా అన్నతో ఉండలేకపోయింది. నా సోదరుడు ఏం తప్పు చేశాడని చంపేశావ్? నీకు వేరొకరు నచ్చితే వారితో పారిపోవచ్చు కదా? ఎందుకు చంపావ్? ఒకరికి సోదరుడిని, మరొకరికి కొడుకును ఎందుకు దూరం చేశావ్?" అంటూ ఇన్ స్టాలో ఓ వీడియో సందేశం పోస్టు చేస్తూ శ్రస్తి కన్నీటిపర్యంతమయ్యారు.