దేశ వ్యాప్తంగా 17 నుంచి మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు
దేశ వ్యాప్తంగా 17 నుంచి మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు
- ఇండోర్లో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
- విశాఖలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్ యాదవ్
- కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు
మహిళల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ తో సహా దేశ వ్యాప్తంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు 15 రోజులపాటు ప్రత్యేక వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు జరగబోతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు " స్వస్త్ నారీ-స్వషక్త్ పరివార్ అభియాన్ "నినాదంతో తో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, ప్రాథమిక, పట్టణ, సామాజిక, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రుల్లో ఈ వైద్య శిబిరాలు జరుగనున్నాయి. ఈ వైద్య శిబిరాల ద్వారా స్పెషలిస్టు వైద్యులు మహిళలకు చికిత్స అందించనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శిబిరాలను ప్రారంభించనున్నారు. ఇదే సమయానికి ఇతర రాష్ట్రాల్లో వైద్య శిబిరాలు ప్రారంభమవుతాయి. విశాఖలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రంలోని 10,032 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, 1,144 పీహెచ్సీలు, 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 175 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్య శిబిరాలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
స్పెషలిస్టు వైద్యుల ద్వారా పరీక్షల నిర్వహణ
ఈ వైద్య శిబిరాల్లో గైనిక్, చిన్నపిల్లల వైద్యులు, కంటి, ఈఎన్టీ, డెంటల్, సైకియాట్రీ, డెర్మటాలజీ వైద్యులు సేవలందిస్తారు. ఈ శిబిరాల్లో ప్రత్యేకంగా హెల్త్ కియోస్క్ లను ఏర్పాటు చేస్తారు. మహిళలకు హిమోగ్లోబిన్, బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ స్క్రీనింగ్, గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తారు. చిన్నారులకు టీకాలు వేస్తారు. రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తారు. పౌష్టికాహార ప్రాధాన్యం గురించి కూడా మహిళలకు వివరిస్తారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనిమీయా స్క్రీనింగ్ చేసి, కార్డుల్ని జారీ చేస్తారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్డులు, 70 ఏళ్లు దాటిన వారికి వయోవందన కార్డుల జారీకి అవసరమైన రిజిస్ట్రేషన్లు ఈ వైద్య శిబిరాల్లో జరుగుతాయి.
ఏర్పాట్లపై కమీషనర్ వీడియో కాన్ఫరెన్స్
మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ లోని తన కార్యాలయం నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వైద్య శిబిరాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. శిబిరాల ప్రారంభ కార్యక్రమంలో లోక్ సభ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ఆహాన్వాలు పంపాలని, శిబిరాల ద్వారా చికిత్స పొందిన వారి వివరాలను ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని స్పష్టంచేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు, అసోసియేషన్ల వారిని కూడా వైద్య శిబిరాల నిర్వహణలో భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు.