ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీకి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం - రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీకి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం - రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- 63,50,765 మంది లబ్ధిదారులకు పెన్షన్ ల పంపిణీకి రూ. 2,745.05 కోట్లు విడుదల
- కొత్తగా మంజూరైన 10,578 మంది స్పౌజ్ పెన్షన్ ల పంపిణీ
- స్పౌజ్ పెన్షన్ ల కోసం అదనంగా రూ. 4.23 కోట్లు విడుదల
అమరావతి: 29 సెప్టెంబర్ 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీర్ భరోసా పెన్షన్ పథకం కింద అక్టోబర్ ఒకటవ తేదీన 63,50,765 మంది లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు రూ. 2,745.05 కోట్లు గ్రామ, వార్డు సచివాలయాలకు విడుదల చేసిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా మంజూరైన 10,578 మంది స్పౌజ్ పెన్షన్ లబ్దిదారులకు అక్టోబర్ 1న పెన్షన్ పంపిణీ చేయడానికి రూ. 4.23 కోట్లు కూడా విడుదలచేశామని మంత్రి చెప్పారు. బుధవారం జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి తెలియజేశారు.కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా విజయనగరం జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలో పేదల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పాల్గొనడం ఆనందించదగ్గ విషయమన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ప్రారంభమైన తర్వాత పెన్షన్ల ద్వారా 45 వేల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించామని మంత్రి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పింఛన్ల కోసం రూ. 32,143 కోట్లు బడ్జెట్ కేటాయించగా, ఇందులో ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2025 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీకి రూ. 19,111.85 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ కోసం ఏడాదిలో రూ. 10,000 కోట్లకు మించి కేటాయించడం లేదని తెలియజేశారు. పెన్షన్ పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా, లబ్ధిదారుల ఇంటి వద్దే పెన్షన్ అందించడం తోపాటు వారి జియో-కోఆర్డినేట్స్ను కూడా నమోదు చేస్తున్నామని అన్నారు.
ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు వంటి నిరుపేద, నిస్సహాయ వర్గాల కష్టాలను తొలగించడానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ఒక ముఖ్యమైన సంక్షేమ పథకంగా అమలు చేస్తోందని అన్నారు. దేశంలో సామాజిక భద్రతా పెన్షన్ కోసం అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు.
