జిల్లాల పునర్విభజనపై కీలక చర్చలు
జిల్లాల పునర్విభజనపై కీలక చర్చలు
– ఉపసంఘ సమావేశంలో మంత్రి వంగలపూడి అనిత
అమరావతి, నవంబర్ 5 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేయడానికి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం బుధవారం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మంత్రి వంగలపూడి అనిత పాల్గొని అధికారులు, సహచర మంత్రులతో కలిసి పలు అంశాలపై లోతుగా చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మండలాలు–గ్రామాల పేర్ల మార్పులు, చేర్పులు వంటి అత్యంత కీలక అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. మంత్రి అనిత మాట్లాడుతూ, జిల్లాల పునర్విభజన ప్రజల సౌలభ్యం, పరిపాలనా సమర్థత, సేవల పారదర్శకత్వం దృష్టిలో పెట్టుకొని జరగాలని అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాల రూపకల్పనలో భౌగోళిక అంశాలు, జనసాంధ్రత, వనరుల పంపిణీ, రవాణా సౌకర్యాలు, చరిత్ర–సాంస్కృతిక భావనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ నిర్ణయం ప్రజల రోజువారీ జీవన విధానాన్ని ప్రభావితం చేసే అంశమని, అందువల్ల అత్యంత జాగ్రత్తగా, అధ్యయనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సమావేశంలో కేబినెట్ సబ్కమిటీ సభ్యులు సత్య అనగాని, నాదెండ్ల మనోహర్, బీసీ జనార్ధన రెడ్డి, రామానాయుడు పాల్గొన్నారు. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ, ఫీల్డ్ స్టడీ, ప్రతిపాదిత కొత్త జిల్లాల మ్యాప్, వనరుల పునర్విభజన అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. పలు జిల్లాల్లో ప్రజాభిప్రాయ కార్యక్రమాలు నిర్వహించి, వాటి ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకునేందుకు సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల పరిపాలనా పారదర్శకత పెరగడం, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సమీపంగా అందుబాటులో రావడం, అభివృద్ధి ప్రణాళికలు వేగవంతం కావడం వంటి ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పేర్ల మార్పులు, చేర్పుల విషయాల్లో స్థానిక ప్రజాభిప్రాయాన్ని తప్పనిసరిగా పరిగణించాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
