కొత్త ఎక్సైజ్ పాలసీ.. వినియోగదారులకు సౌకర్యం, అమ్మకందారులకు లాభం!
కొత్త ఎక్సైజ్ పాలసీ.. వినియోగదారులకు సౌకర్యం, అమ్మకందారులకు లాభం!
న్యూఢిల్లీ, నవంబర్ 5 ( పీపుల్స్ మోటివేషన్):
రాజధాని ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ విధానాన్ని తీసుకురావడానికి రేఖా గుప్త ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం సిద్ధం చేస్తున్న కొత్త మద్యం విధానంలో అనేక కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందులో మద్యం దుకాణాల విస్తరణ, ఆధునీకరణ, అలాగే రిటైలర్లకు బాటిల్కి లాభాలను పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రజా పనుల శాఖ మంత్రి ప్రవేశ్ వర్మ నేతృత్వంలోని కమిటీ ఈ కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఇది తుదిదశలో ఉందని తెలుస్తోంది. స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మద్యం దుకాణాలను నివాస ప్రాంతాలు, పాఠశాలలు, దేవాలయాలు వంటి ప్రదేశాలకు దూరంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నాలుగు ప్రభుత్వ కార్పొరేషన్లు నిర్వహిస్తున్న మద్యం దుకాణాల వ్యవస్థను కొనసాగించాలని ప్రతిపాదించారు. దీని అర్థం ఏంటంటే ఇకపై ఢిల్లీలో ప్రైవేట్ కంపెనీలకు మద్యం దుకాణాలు నడపడానికి అవకాశం ఉండదు. కొత్త విధానం వినియోగదారులకు, దుకాణదారులకు రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో భారతదేశంలో తయారు చేసే విదేశీ మద్యం బాటిల్కి రూ.50, దిగుమతి మద్యం బాటిల్కి రూ.100 లాభ మార్జిన్ పెంచాలని నిర్ణయించారు. దీంతో దుకాణదారులు మెరుగైన, ప్రీమియం బ్రాండ్ల మద్యం నిల్వ చేయడానికి ఆసక్తి చూపుతారని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 700కి పైగా మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిని నాలుగు ప్రభుత్వ సంస్థలు — డీఎస్ఐఐడీసీ, డీటీటీడీసీ, డీఎస్సీఎస్సీ, డీసీసీడబ్ల్యూఎస్ — నిర్వహిస్తున్నాయి. కొత్త విధానం ప్రకారం వీటిని మరింత ఆధునికంగా, విశాలంగా మార్చి మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లలో వినియోగదారులకు సౌకర్యవంతమైన విధంగా ప్రారంభించనున్నారు.
2021-22లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం విధానం అవినీతి ఆరోపణలతో రద్దైంది. ఆ తరువాత 2022 సెప్టెంబర్లో తాత్కాలిక ఎక్సైజ్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. అయితే ఆ విధానంలో కూడా అనేక అక్రమాలు బయటపడ్డాయి. దీంతో సీబీఐ, ఈడీ దర్యాప్తులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆ పాత విధానాన్ని పలు మార్లు పొడిగించి మార్చి 31, 2026 వరకు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యలోనే రేఖా గుప్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త ఎక్సైజ్ విధానం అవసరమని నిర్ణయించింది. కొత్త విధానాన్ని ఇప్పుడు ప్రజాభిప్రాయాల కోసం విడుదల చేస్తున్నారు. ఆపై మంత్రివర్గం, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లభించిన తరువాత అమలు చేయనున్నారు. ఈ కొత్త విధానం ఢిల్లీలో మద్యం విక్రయ వ్యవస్థను మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా, వినియోగదారులకు అనుకూలంగా మార్చుతుందని ప్రభుత్వం పేర్కొంది.
