ఈనెల 21 న రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో
ఈనెల 21 న రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో
54 లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు భారీ ఏర్పాట్లు
వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి
ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారని
వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకమార్ యాదవ్ నేడొక ప్రకటనలో తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్లల్లందరికీ పోలియో చుక్కల్ని తప్పకుండా వేయించాలని, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,07,663 మంది 5 ఏళ్ల లోపు పిల్లలకు 38,267 బూత్ లలో పోలియో చుక్కలు వేసేందుకు ఇప్పటికే జిల్లాలకు 61,26,120 డోస్ లను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించారని తెలిపారు.
డిసెంబరు 21 పోలియో దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయిలో పిల్లలకు పోలియో చుక్కల్ని వేస్తారని, ఆరోజు పలు కారణాలవల్ల పోలియో చుక్కలు వేసుకోలేకపోయిన పిల్లలకు తిరిగి ఈనెల 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి 76,534 బృందాలు పరిశీలిస్తాయని మంత్రి పేర్కొన్నారు. భారతదేశం పోలియో రహిత దేశం అయినప్పటికీ మళ్లీ పోలియో రాకుండా ఉండేందుకు తగు ముందస్తు జాగ్రత్తల్ని తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని తెలిపారు. 1704 మెడికల్ అధికారులు, 39,494 ఇతరులు (ఫార్మసిస్టులు, నర్సింగ్ విద్యార్థులు, ఇతర సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు), 4206 మంది పర్యవేక్షకులు నేషనల్ ఇమ్యునైజేషన్ డే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పల్స్ పోలియో ఏర్పాట్లకు సంబంధించి వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన స్టేట్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగిందని, జిల్లా, పట్టణ, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశాలు జరుగుతున్నాయని, ఏర్పాట్ల గురించి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ లేఖలు రాశారని మంత్రి పేర్కొన్నారు.
1854 మొబైల్ బృందాలు-1140 ట్రాన్సిట్ బూత్ లు
పలు ప్రాంతాల్లో తిరిగేందుకు మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి మొబైల్ బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్ తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. ఈనెల 21 నుండి 23 వరకు మొబైల్ బృందాలు పర్యటిస్తాయి. ఈనెల 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలోపు పిల్లలందరినీ పరిశీలించి, వారికి పోలియో చుక్కలు వేస్తారు. ఇంటిలోని పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తే “P” గుర్తుతోనూ, ఏ చిన్నారైనా మిస్ అయితే “X” గుర్తు వేస్తారు. అన్ని ట్రాన్సిట్ పాయింట్లలో (బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన ఆస్పత్రులు, మేళాలు, బజార్లు మొదలైనవి) ఈనెల 21 నుండి 23 వరకు ట్రాన్సిట్ బృందాలు పర్యటిస్తాయి. గుర్తించిన పలు ప్రాంతాలను (స్లమ్లు, సంచార జాతులు, నిర్మాణ స్థలాలు, ఇటుక క్షేత్రాలు, ఇతర వలస ప్రాంతాలు) కవర్ చేయడానికి 1854 మొబైల్ బృందాలు పనిచేస్తాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మేళాలు, బజార్లు, పర్యాటక ప్రదేశాలలో 1140 ట్రాన్సిట్ బూత్లను ఏర్పాటు చేశారు.
