ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలి
ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలి
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని సూచించారు.
గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లు, ఎన్నికల పరిశీలకులు, అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన స్టేజ్ 2 జోనల్ ఆఫీసర్ల శిక్షణ తరగతులు, సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ కు ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ తదితర అంశాలపై కమిషనర్ సమీక్షించారు. ఎన్నికలు ముగిసే వరకు అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పటిష్టంగా అమలు చేయాలన్నారు. అన్ని నిబంధనలు తు.చ. తప్పక పాటించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియమాలు, ఏకగ్రీవ స్థానాలలో ఉపసర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులు, తదితర అంశాల పట్ల ఎన్నికల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాలలో ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అన్నారు.
ఏకగ్రీవంగా ఎంపికైన గ్రామ సర్పంచ్ పోస్టులకు ఫారం10 ప్రకారం ఫలితాల ప్రకటన చేపట్టాలని అన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత సంబంధిత గ్రామాలలో స్టేజ్-2 రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి చేయాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్, వ్యయ పరిశీలకులు రాజేష్ బాబు, యం సి సి నోడల్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

