ప్రజల మానసిక ఉల్లాసానికి ఉద్యానవనాల అభివృద్ధి
ప్రజల మానసిక ఉల్లాసానికి ఉద్యానవనాల అభివృద్ధి
• వీనస్ కాలనీ పార్కు అభివృద్ధికి మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన
• నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేయాలి
• ఎల్ఆర్యస్, బిపియస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కర్నూలు మున్సిపాలిటీ, జనవరి 30 (పీపుల్స్ మోటివేషన్):-
నగర ప్రజల మానసిక ఉల్లాసం, ఆహ్లాదకర వాతావరణం కోసం ఉద్యానవనాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవార నగరంలోని వీనస్ కాలనీ పార్కులో రూ.45 లక్షల వ్యయంతో చేపట్టనున్న కాంపౌండ్ వాల్ నిర్మాణం, థెరప్యూటిక్ గార్డెన్ (పంచతత్వ నడక మార్గం), నడకబాట, గ్రీనరి ఏర్పాటు, 168 అడుగుల జాతీయ జెండా నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో ప్రజలకు ప్రశాంతత, ఆరోగ్యకర జీవనశైలి అందించడంలో ఉద్యానవనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు నిత్యం వినియోగించుకునేలా అన్ని మౌలిక సదుపాయాలతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా నగరంలో పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని అన్నారు.
నగరంలో రూ.25.25 కోట్ల సాధారణ, రూ.4.16 కోట్ల 15వ ఆర్థిక సంఘం, రూ.40 లక్షలు ‘కూడా’ నిధులతో అభివృద్ధి పనులను చురుగ్గా జరుగుతున్నాయని, అలాగే త్వరలో కర్నూలు నియోజకవర్గ పరిధిలో కొత్తగా 6 పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన సూచనలు చేశారు.
అలాగే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్యస్), బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బిపియస్) పథకాల ద్వారా అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఈ పథకాల ద్వారా ప్రజలు తమ ఆస్తులకు చట్టబద్ధత సాధించడంతో పాటు నగరాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూరుతాయని పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఎల్ఆర్యస్, బిపియస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ క్రిష్ణలత, టిఏఈలు పవన్, రాజేష్, బి.ఉదయ్, శానిటేషన్ ఇంస్పెక్టర్ మునిస్వామి, తదితరులు పాల్గొన్నారు.
