కోచ్ జెలెజ్నీతో విడిపోయిన నీరజ్ చోప్రా..
కోచ్ జెలెజ్నీతో విడిపోయిన నీరజ్ చోప్రా..
- స్నేహపూర్వకంగా ముగిసిన భాగస్వామ్యం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా తన కోచ్ జాన్ జెలెజ్నీతో కోచింగ్ భాగస్వామ్యాన్ని ముగించుకున్నాడు. ఈ నిర్ణయం ఇద్దరి పరస్పర అంగీకారంతో తీసుకున్నదని సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. తమ మధ్య నమ్మకం, గౌరవం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
జెలెజ్నీ శిక్షణలోనే నీరజ్ తొలిసారిగా 90 మీటర్ల మార్క్ను దాటిన సంగతి గుర్తు చేశారు. ఈ ప్రయాణం తనకు ఎంతో అర్థవంతమైందని నీరజ్ తెలిపాడు. చిన్ననాటి హీరో అయిన జెలెజ్నీ వద్ద శిక్షణ పొందడం ప్రత్యేక అనుభవమని, టెక్నిక్, రిథమ్, కదలికలపై ఆయన ఆలోచన విధానం నుంచి చాలా నేర్చుకున్నానని పేర్కొన్నాడు.
జెలెజ్నీ కూడా ఈ భాగస్వామ్యంపై సంతృప్తి వ్యక్తం చేశాడు. నీరజ్ లాంటి అథ్లెట్తో పని చేయడం గొప్ప అనుభవమని, అతను 90 మీటర్ల మార్క్ను దాటడంలో తాను సహాయపడగలిగినందుకు ఆనందంగా ఉందని తెలిపాడు. ప్రపంచ ఛాంపియన్షిప్కు 12 రోజుల ముందు వెన్నునొప్పి రావడం అతని అవకాశాలను ప్రభావితం చేసిందని పేర్కొన్నాడు.
ఇకపై తన శిక్షణ బాధ్యతలను తానే చూసుకోవాలని నీరజ్ నిర్ణయించుకున్నాడు. ఇప్పటివరకు పని చేసిన ఉత్తమ కోచ్ల నుంచి నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టనున్నట్లు వెల్లడించాడు. 2026 సీజన్పై ఆశాభావం వ్యక్తం చేస్తూ, 2027 ప్రపంచ ఛాంపియన్షిప్, 2028 ఒలింపిక్స్ తన ముందున్న ప్రధాన లక్ష్యాలని నీరజ్ స్పష్టం చేశాడు.
