మున్సిపల్ ఎన్నికల నిబంధనలపై అవగాహన సదస్సు
మున్సిపల్ ఎన్నికల నిబంధనలపై అవగాహన సదస్సు
- ప్రవర్తనా నియమావళి, వ్యయ పరిమితులపై స్పష్టత
- నిబంధనలు కట్టుదిట్టంగా పాటించాలి: పరిశీలకులు
అదిలాబాద్, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు బుధవారం అదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల వ్యయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్, అదనపు కలెక్టర్లు శ్యామలా దేవి, రాజేశ్వర్ పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలంటే ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని పరిశీలకులు స్పష్టం చేశారు. ప్రచారం నిర్వహణ, సమావేశాలు, ప్రకటనలు, సోషల్ మీడియా వినియోగం, పోలింగ్ రోజున పాటించాల్సిన నిబంధనలపై అభ్యర్థులకు వివరించారు. ఎన్నికల వ్యయానికి సంబంధించిన అనుమతులు, ఖర్చుల నమోదు, ఖాతాల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సదస్సులో వ్యయ పరిశీలకులు విజయ, నోడల్ అధికారులు మనోహర్, సునీత కుమారి, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొని ఎన్నికల వ్యయ పరిమితులు, నివేదికల సమర్పణ విధానంపై అవగాహన కల్పించారు. నిబంధనల ఉల్లంఘనలకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు పిలుపునిచ్చారు.

