ప్రజారోగ్యంపై సీఎం సమీక్ష
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ప్రజారోగ్యంపై సీఎం సమీక్ష
- శ్రీకాకుళంలో 76 మందికి చికిత్స
- కల్తీ పాల ఘటనపై కఠిన హెచ్చరిక
- నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ఆదేశాలు
అమరావతి, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్): ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను గట్టిగా హెచ్చరించారు. శ్రీకాకుళంలో విజృంభిస్తున్న డయేరియా, రాజమహేంద్రవరంలో కలకలం రేపిన కల్తీ పాల ఘటనలపై బుధవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రభావంతో ప్రస్తుతం 76 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరికి వెంటిలేటర్పై, మరొకరికి డయాలసిస్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో శుద్ధి చేసిన తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో వైద్య బృందాలను మోహరించి ఇంటింటి పర్యటనలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. రాజమహేంద్రవరంలో వెలుగుచూసిన కల్తీ పాల ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల నమూనాల నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రజారోగ్యం పరిరక్షణే ప్రభుత్వ ప్రాధాన్యమని, ఎక్కడైనా అలసత్వం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జిల్లాల వారీగా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేసి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
Comments
