భారత్లో అమ్మకాలు పెంచుకునేందుకు టెస్లా కొత్త ప్రణాళిక..
భారత్లో అమ్మకాలు పెంచుకునేందుకు టెస్లా కొత్త ప్రణాళిక..
హైదరాబాద్ – 04 ఫిబ్రవరి 2026 – పీపుల్స్ మోటివేషన్
భారత మార్కెట్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. ప్రీమియం ధరల కారణంగా తగ్గిన డిమాండ్ను పెంచుకునేందుకు ఈఎంఐ సౌకర్యాలు, పాత కారు మార్పిడిపై ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో కంపెనీ అధికారికంగా తన కొత్త ప్రణాళికలను వెల్లడించింది.
టెస్లా మోడల్ వై కారును కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇప్పుడు సులభమైన చెల్లింపు విధానాన్ని అందిస్తోంది. రూ.6 లక్షల డౌన్ పేమెంట్తో నెలకు రూ.49 వేల ఈఎంఐ చెల్లిస్తూ ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే పాత పెట్రోల్ లేదా డీజిల్ కారును మార్పిడి చేసుకునే వినియోగదారులకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఎక్స్చేంజ్ ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఈ చర్యల ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను టెస్లా వైపు ఆకర్షించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
టెస్లా కారు వినియోగం వల్ల ఇంధన ఖర్చులు, నిర్వహణ వ్యయాల్లో నెలకు సుమారు రూ.20 వేల వరకు ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది. దీంతో నెలవారీ వాస్తవ ఖర్చు ఈఎంఐతో కలిపి సుమారు రూ.29 వేల వరకు మాత్రమే ఉంటుందని వివరించింది. దీర్ఘకాలంలో ఇది సాధారణ ఇంధన కార్లతో పోలిస్తే వినియోగదారులకు లాభదాయకంగా మారుతుందని టెస్లా చెబుతోంది.
గత ఏడాది భారత మార్కెట్లో అడుగుపెట్టిన టెస్లా మోడల్ వైకి తొలుత మంచి స్పందన లభించినప్పటికీ, అధిక ధర కారణంగా అమ్మకాలు క్రమంగా తగ్గాయి. గత సంవత్సరం మొత్తం మీద కేవలం 225 కార్లే విక్రయించగలిగింది. అదే సమయంలో బీఎండబ్ల్యూ, బీవైడీ వంటి సంస్థలు ఆకర్షణీయమైన ఫీచర్లతో పోటీగా తమ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడంతో టెస్లాకు గట్టి సవాల్ ఎదురైంది. ఈ పరిస్థితుల్లో భారత మార్కెట్లో తన స్థానం బలపర్చుకునేందుకు టెస్లా ఈ కొత్త ఆఫర్లతో దూకుడు పెంచుతోంది.
