శాసనమండలిలో రభసపై జనసేన ఆగ్రహం
శాసనమండలిలో రభసపై జనసేన ఆగ్రహం
- బడ్జెట్ చర్చకు వైసీపీ దూరమని విమర్శ
- చైర్మన్ పోడియం ఎక్కడం అప్రజాస్వామికమని ఖండన
- జగన్పై ఘాటైన వ్యాఖ్యలు
అమరావతి, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్): శాసనమండలిలో కావాలనే రభస సృష్టించి ప్రజా సమస్యలు, రాష్ట్ర బడ్జెట్పై చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ వైసీపీపై మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన వారు, విలువైన సభా సమయాన్ని వృథా చేయడం దురుద్దేశపూర్వక చర్య అని ఆరోపించారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన రాష్ట్ర బడ్జెట్పై చర్చించాల్సిన విపక్ష పార్టీ శాసనమండలిలో సంఖ్యాబలం ప్రదర్శనకే పరిమితమైందని విమర్శించారు. పార్టీ ఎమ్మెల్సీలతో చైర్మన్ పోడియం ఎక్కించి సమావేశాలకు అంతరాయం కలిగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. బీసీ వర్గాలకు భారీ కేటాయింపులు, పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు నిధులు వంటి అనేక అంశాలు బడ్జెట్లో ఉన్నప్పటికీ వాటిపై చర్చించేందుకు వైసీపీకి ఓపిక లేదని వ్యాఖ్యానించారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన బడ్జెట్పై సుహృద్భావ వాతావరణంలో చర్చించాల్సిన అవసరం ఉందని వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. కానీ శాసనమండలిలో రభస సృష్టించి బడ్జెట్పై దృష్టి మళ్లించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ నాయకత్వానికి గొడవలే ముఖ్యమని ఘాటుగా విమర్శించారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ, శాసనసభలో సమయం ఇవ్వలేదని చెప్పి గైర్హాజరైన వైసీపీ సభ్యులు, శాసనమండలిలో సమయం ఉన్నప్పటికీ చర్చను అడ్డుకోవడం ఏ విధానమని ప్రశ్నించారు. చైర్మన్ పోడియం ఎక్కి రభస చేయడం అప్రజాస్వామిక చర్య అని ఖండించారు. కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో బడ్జెట్ రూపొందించిందని, దానిపై చర్చించేందుకు ధైర్యం లేక సభలో రచ్చ చేస్తున్నారని విమర్శించారు.
