ప్రతి పేదవాడికి సొంతింటి కల సాకారం
ప్రతి పేదవాడికి సొంతింటి కల సాకారం
- ఈ ఏడాది 10 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు లక్ష్యం
- 2029 నాటికి అందరికీ పక్కా ఇళ్లు
- వ్యవసాయానికి పంచ సూత్రాల ఊతం
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి, ఫిబ్రవరి 27 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీలో గృహ నిర్మాణం, వ్యవసాయ శాఖల పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఇళ్లకు గృహప్రవేశాలు జరిపిస్తామని ప్రకటించారు. ఇప్పటికీ ఇల్లు లేని నిరుపేదలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే తమ ధ్యేయమని తెలిపారు. రాయచోటి నుంచి ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించామని, ఉగాది నాటికి దాదాపు 3 లక్షల ఇళ్లలో లబ్ధిదారులు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జూన్ నాటికి మరో 2.26 లక్షలు, సెప్టెంబర్ నాటికి ఇంకో 2.10 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు పూర్తి చేస్తామని స్పష్టమైన ప్రణాళికను వెల్లడించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు కేటాయిస్తామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణం, ఇసుక విధానాల్లో జరిగిన అవినీతిపై సీఎం తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల ఇళ్ల పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారాల్లో పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాయని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ‘పంచ సూత్రాల’ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. అగ్రి సాంకేతికత, నీటి భద్రత, డిమాండ్ ఉన్న పంటల సాగు, ఆహార ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రైతులకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఇప్పటికే 47 లక్షల మందికి రెండు విడతల్లో రూ.6,309 కోట్లు జమ చేశామని చెప్పారు. ఉచిత విద్యుత్ కోసం భారీగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. రాయలసీమను ఉద్యాన హబ్గా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేశామని, రాష్ట్ర అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
