నీటి హక్కులో రాజీలేదు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
నీటి హక్కులో రాజీలేదు
- గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిస్తాం
- తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం
- దేవాదుల ఎత్తిపోతల పథకంపై స్థల పరిశీలన, సమగ్ర సమీక్ష
- రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం
ములుగు, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్): గోదావరి నదీ జలాల వినియోగం, వాటిపై తలెత్తిన వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అన్ని అంశాలపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సమగ్రంగా ఒకరోజు చర్చ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుతామని పునరుద్ఘాటించారు. నీటి హక్కుల విషయంలో అనవసర గందరగోళం సృష్టించవద్దని సూచించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఇంజనీర్లతో మాట్లాడి ప్రాజెక్టు పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. దేవాదుల ఇంటేక్ పాయింట్ వద్ద మోటార్లను పరిశీలించిన అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడానికి నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిపారు.
నీటి వివాదాల విషయంలో మొదట రెండు రాష్ట్రాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం, నదీ పరిపాలన బోర్డులు, ట్రిబ్యునళ్లు, సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నికర, మిగులు, వరద జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకుంటామని తెలిపారు. గత పదేళ్లలో ప్రాజెక్టుల నిర్లక్ష్యం వల్ల నష్టపోయామని, ఇకపై అలాంటి పరిస్థితి రానివ్వబోమని అన్నారు. రాష్ట్రంపై అప్పుల భారం ఉన్నప్పటికీ వచ్చే రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తెలంగాణ ప్రజల ఆస్తి అని, వాటిని పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తామని చెప్పారు. గోదావరి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Comments

